సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖ హెచ్ఎండీఏ. హైదరాబాద్ చుట్టూ 7 జిల్లాల పరిధిలో సుమారు 50 కి.మీ దూరం వరకు విస్తరించిన హెచ్ఎండీఏ పరిధిలో పట్టణీకరణతో పాటు పరిశ్రమలు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కొత్తగా నిర్మించే రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో ఉద్యోగులు, వివిధ విభాగాలకు ఇప్పుడున్న దానికంటే ఎక్కువ మొత్తంలో ఆఫీసు స్థలం అవసరం ఉంటుంది.
అయితే ప్రస్తుతం అమీర్పేటలోని స్వర్ణ జయంతి కమర్షియల్ కాంప్లెక్సులో ఉన్న హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంతో పాటు హుస్సేన్సాగర్ తీరంలో ఉన్న బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు కార్యాలయం, అదేవిధంగా నానక్రాంగూడలో ఉన్న హైదరాబాద్ గ్రోత్ కారిడాల్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్), అర్బన్ ఫారెస్ట్ కార్యాలయాలను అన్నింటినీ కలిపి బేగంపేటలోని పైగా ప్యాలెస్లోకి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఆగస్టు నాటికల్లా తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని డెడ్లైన్ కూడా పెట్టింది. దీంతో అధికారులు ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా హెచ్ఎండీఏ కార్యాలయాల తరలింపు ప్రక్రియను మొదలు పెట్టారు. అయితే హెచ్ఎండీఏ కార్యాలయాలన్నింటినీ పైగా ప్యాలెస్కు తరలించాలన్న నిర్ణయంపై ఉద్యోగులు అయిష్టత చూపుతున్నట్లు సమాచారం. అక్కడ స్థలం ఏ మాత్రం సరిపోదని..తక్కువ స్థలంలో కార్యాలయాల కూర్పు కష్టసాధ్యమని, ఇప్పుడున్న చోటే ఎంతో బాగుందని, ఎక్కడ ఉండాల్సిన కార్యాలయాలు..అక్కడ ఉంటేనే బాగుంటాయన్న అభిప్రాయం ఉద్యోగుల వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు తెలిసింది.
కోర్ సిటీలోని బేగంపేటలో 2007 వరకు పైగా ప్యాలెస్ భవనంలో అప్పటి హుడా (హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) కార్యాలయం కొనసాగింది. ఆ తర్వాత 2008 నుంచి హుడా కాస్తా హెచ్ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ)గా అవతరించింది. తార్నాకలోని సొంత భవనంలో సుమారు 13 ఏండ్ల పాటు కొనసాగిన హెచ్ఎండీఏ కార్యాలయం రెండేండ్ల నుంచి అమీర్పేటలో సొంత భవనమైన స్వర్ణ జయంతి కాంప్లెక్సులో కొనసాగుతున్నది.
ఈ కార్యాలయం ఆధునీకరణ కోసం సుమారు రూ.10 కోట్ల దాకా వెచ్చించి అత్యంత అధునాతన, విశాలమైన ఆఫీస్ ప్రాంగణాన్ని హెచ్ఎండీఏ కార్యకలాపాలకు సిద్ధం చేసింది. మొత్తం 5 అంతస్తుల్లో హెచ్ఎండీఏకు చెందిన వివిధ విభాగాలు ఉన్నాయి. ఇవే కాకుండా మరో రెండు చోట్ల హెచ్ఎండీఏకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి.
వాటిలో ఒకటి హుస్సేన్సాగర్ తీరంలోని లుంబినీ పార్కు వద్ద బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ(బీపీపీఏ), ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్), అర్బన్ ఫారెస్ట్ కార్యాలయాలు నానక్రాంగూడలోని ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ సర్కిల్లో ఉన్నాయి. వీటన్నింటినీ ఒకే చోటైన బేగంపేట పైగా ప్యాలెస్కు తరలించాలన్న నిర్ణయం పట్ల హెచ్ఎండీఏ ఉద్యోగులే.. సరైన నిర్ణయం కాదంటూ పేర్కొంటున్న పరిస్థితి నెలకొన్నది.
బేగంపేటలోని పైగా ప్యాలెస్కు ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉంది. ఈ భవనంలోనే గతంలో హుడా కార్యాలయం ఉండేది. ప్రస్తుతం హుడా పరిధి పెరిగి హెచ్ఎండీఏగా మారడంతో వందలాది మంది ఉద్యోగులు, వివిధ విభాగాలు కొత్తగా వచ్చాయి. అలాంటప్పుడు తక్కువ భవన నిర్మాణ స్థలం ఉన్న పైగా ప్యాలెస్లో అన్ని విభాగాలకు అనుకూలంగా ప్రత్యేక చాంబర్లు, ఉద్యోగుల కోసం క్యాబిన్లు ఏర్పాటు చేయాలంటే స్థలం సరిపోదనే అభిప్రాయాన్ని హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే అమీర్పేటలోని స్వర్ణ జయంతి కమర్షియల్ కాంప్లెక్సులో హెచ్ఎండీఏ కార్యాలయాల కోసం ఒకేసారి రూ.10 కోట్ల దాకా వెచ్చించి రెండేండ్ల కిందటే ఆధునీకరించారు. అలాంటి కార్యాలయాన్ని మళ్లీ తరలిస్తే రూ.10 కోట్లు వెచ్చించిన కార్యాలయం ఫర్నిచర్, ఇంటీరియర్ అంతా వృథా అవుతుంది. మరోవైపు స్వర్ణజయంతి కమర్షియల్ కాంప్లెక్సులోకి ప్రైవేటు సంస్థలు అద్దెకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే 8 అంతస్తులుగా ఉన్న భవనంలో 20-25 శాతం ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి హెచ్ఎండీఏ కార్యాలయాన్ని పైగా ప్యాలెస్కు తరలిస్తే.. అద్దెకు వచ్చే వారు తక్కువగా ఉన్నారని, అదే విధంగా రూ.10 కోట్ల దాకా వెచ్చించి చేపట్టిన ఇంటీరియల్ డిజైన్స్, అధికారుల చాంబర్స్ అన్ని తొలగించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
అదే సమయంలో పైగా ప్యాలెస్లో కొత్తగా మళ్లీ ఉన్నతాధికారుల చాంబర్లు, క్యాబిన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల అదనంగా కోట్లలోనే మరోసారి ఖర్చు చేయాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని ఆర్ఆర్ఆర్ వరకు విస్తరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం భవిష్యత్ అవసరాలు, వివిధ విభాగాల విస్తరణ కార్యకలాపాలు పెరిగితే బేగంపేటలోని పైగా ప్యాలెస్ భవనంలోని స్థలం ఏమాత్రం సరిపోదని, ఇప్పటికైనా సర్కారు పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.