ప్రత్యేక పూజలు చేసిన మంత్రి తలసాని దంపతులు
మిరుమిట్లు గొలిపే విద్యుత్కాంతులు.. మేళతాళాలు.. పటాకుల మోత.. కళాకారుల నృత్యాల నడుమ బుధవారం సాయంత్రం బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం రమణీయంగా సాగింది. తీరొక్క పూలతో సుందరంగా అలంకరించిన రథంపై అమ్మవారిని ప్రతిష్ఠించి ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. 3రోజులుగా జరుగుతున్న ఉత్సవాలు రథోత్సవంతో పరిసమాప్తమయ్యాయి.
అమీర్పేట్, జూలై 6: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవం బుధవారం సాయంత్రం వైభవంగా జరిగింది. రంగురంగు పూలతో అలంకరించిన రథంపై ప్రతిష్ఠించిన అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ దంపతులు పూజలు నిర్వహించి రథాన్ని ముందుకు కదిలించారు. విద్యుత్ కాంతులు.. మేళతాళాలు, బాణాసంచా హోరుతో కళాకారులు నృత్యాల నడుమ అమ్మవారి రథం ఊరేగింపు దేవాలయం నుంచి ప్రారంభమై వీరాంజనేయ స్వామి దేవాలయం, గ్రీన్ల్యాండ్స్ హోటల్, పాత ఎస్ఆర్నగర్ పీఎస్ ముందు నుంచి కమ్యూనిటీ హాలు బీకేగూడ వార్డు కార్యాలయ చౌరస్తాల మీదుగా రాత్రి దేవాలయానికి చేరింది. రథంపై వస్తున్న అమ్మవారికి భక్తులు స్వాగతాలు పలుకుతూ.. ప్రసాదాన్ని పంచి పెట్టారు. ఈ వేడుకల్లో అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, దేవాలయ చైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్, ఈవో ఎస్.అన్నపూర్ణ, దేవాలయ పాలక మండలి సభ్యులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మూడు రోజులుగా జరుగుతున్న ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవాలు ఈ రథోత్సవంతో ముగిశాయి.
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
రాంగోపాల్పేట్ ఓల్డ్ బోయిగూడలో బోనాల ఉత్సవాలు
బేగంపేట్ జూలై 6: ప్రైవేట్ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బుధవారం రాంగోపాల్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అత్తెల్లి మల్లిఖార్జున్గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వారి నివాసంలో నిర్వహించిన బోనం సమర్పణ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పాల్లొన్నారు. బోయిగూడలోని మల్లిఖార్జున్గౌడ్ నివాసం నుంచి జోగిని శ్యామల బోనంతో నృత్యాలు చేస్తూ డప్పు చప్పుళ్లతో మహంకాళి అమ్మవారి దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ మల్లిఖార్జున్గౌడ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తలసాని సాయికిరణ్యాదవ్, మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్, జూలై 6: ఆషాఢమాసం సందర్భంగా ప్రతి యేటా నిర్వహించే శాకాంబరి ఉత్సవాలు జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయంలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంతో పాటు గర్భగుడిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పూలతో అలంకరించారు. ఆల య ఫౌండర్ ట్రస్టీ ఇందిరా జనార్ధన్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో తెల్లవారుజామున 3 గంటలకు పెద్దమ్మ తల్లికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణం, యాగశాల ప్రవేశం, కలశ స్థాపన, చండీ పారాయణం, హోమం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహించారు. శాకాంబరీ దేవిగా దర్శనమిస్తున్న పెద్దమ్మ తల్లిని దర్శించుకునేందుకు నగరం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
చాంద్రాయణగుట్ట, జూలై 6: లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయం తరుఫున ఢిల్లీలో మూడు రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ బోనాల జాతర బుధవారం అట్టహాసంగా ముగిసింది. చివరి రోజు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి హజరై కేంద్ర ప్రభుత్వం తరుఫున అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. కేంద్ర టూరిజం శాఖ డైరెక్టర్ కమలవర్ధన్ అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మంద జగన్నాథం అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఫోర్మేన్ కమిటీ చైర్మన్ రాజ్కుమార్, సభ్యులు చెన్నబోయిన శివకుమార్ యాదవ్, పోసాని సురేందర్ ముదిరాజ్, ప్రతినిధులు ఏ. మాణిక్ప్రభుగౌడ్, కే.విష్ణుగౌడ్, కాశీనాథ్గౌడ్, బి.బల్వంత్ యాదవ్, లక్ష్మీనారాయణగౌడ్, కళాకారుల బృందం సభ్యులు నీరజ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.