మేడ్చల్, ఏప్రిల్ 7 : యువతిపై లైంగిక దాడికి యత్నించగా, అతడి తలపై రాయితో కొట్టి బాధితురాలు తప్పించుకున్న ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఒడిశాకు చెందిన యువతి(19) ఆదివారం రాత్రి గుండ్లపోచంపల్లి నుంచి రైల్వే ట్రాక్పై మేడ్చల్ వైపు నడుచుకుంటూ వస్తుండగా గౌడవెళ్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి తనపై లైంగికదాడికి యత్నించాడని.. దీంతో అతడి తలపై రాయితో కొట్టి అక్కడి నుంచి తప్పించుకుని వచ్చానంటూ బాధితురాలు మేడ్చల్ పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసింది.
రైల్వే ట్రాక్పై ఘటన జరగడంతో మేడ్చల్ పోలీసులు కేసును సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు బదలాయించారు. కాగా ఈ విషయమై సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి ఓ గుర్తుతెలియని వ్యక్తి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేసిందన్నారు. ఘటన రైల్వే ట్రాక్పై జరగడంతో రైల్వే పోలీసులకు కేసు బదిలీ చేశామన్నారు. యువతి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామన్నారు.