ఇటీవల మంత్రి కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా ఆత్మసంతృప్తినిచ్చే కార్యక్రమాలు చేపట్టాలని ప్రకటించడం దివ్యాంగులకు వరంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు.‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా దివ్యాంగులకు ఎంపీ రంజిత్రెడ్డి 101, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్కుమార్ 100, శంభీపూర్ రాజు 60, మంత్రి మల్లారెడ్డి 50, మర్రి రాజశేఖర్రెడ్డి 20 మూడు చక్రాల వాహనాలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ నవీన్కుమార్, శంభీపూర్ రాజు అందజేసిన వాహనాలను ఆదివారం నెక్లెస్రోడ్డులో మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. ఇదిలా ఉంటే ఇదే వేదికపై ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 100,
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ మరో 50 వాహనాలు ఇస్తామని ప్రకటించారు. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఎంతో తృప్తి కలుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్కుమార్, అన్నారు.
వారు అందరిలా నడవలేరు.. బయటకు వెళ్లాలన్నా ఎవరో ఒకరి సాయం కావాల్సిందే..అందులో కొందరు కుటుంబ పోషణ కోసం శరీరం సహకరించకున్నా చిరువ్యాపారాలు, చిరుద్యోగాలు చేసుకుంటున్నారు. చిన్న పనులు చేసుకోవాలన్నా చేతికర్రలు, మూడు చక్రాల సైకిళ్లే వారికి దిక్కు. అలాంటి వారికి మంత్రి కేటీఆర్ అరుదైన గిఫ్ట్ను ఇచ్చారు.
తన పుట్టిన రోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’పేరుతో సమాజహిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆదివారం పీవీ నరసింహారావు మార్గ్లోని జలవిహార్ వేదికగా జరిగిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా త్రిచక్రవాహనాలను అందుకున్న ఆ దివ్యాంగులు తమ అనుభూతిని‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా దివ్యాంగులకు త్రి చక్రవాహనాలను అందించిన మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రతి లబ్ధిదారుడి వద్దకు వెళ్లి వారి బాగోగులు తెలుసుకున్నారు. బండి ఎలా ఉంది.. నీ కష్టాలు తీరినట్లేనా.. హ్యాపీనా అంటూ ఆప్యాయంగా వారిని పలుకరిస్తూ సెల్ఫీలు దిగారు. పలు జిల్లాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన దివ్యాంగులు తాము పడ్డ కష్టాలను మంత్రితో పంచుకున్నారు. అనంతరం దివ్యాంగులతో కలిసి మంత్రి భోజనం చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగుల తిరుగు ప్రయాణం కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. వందలాదిగా వచ్చిన దివ్యాంగులకు టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ భోజన ఏర్పాట్లను చేశారు.
చిన్నప్పుడు పోలియో వచ్చి కాళ్లు పనిచేయకుండా పోయాయి. వైకల్యం వల్ల రోజూ ఇంటి నుంచి సఖీ కేంద్రానికి వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. ఈ త్రిచక్ర వాహనాన్ని అందించి నా కష్టాలు తీర్చారు. జీవితంలో మంత్రి కేటీఆర్ చేసిన సాయాన్ని మరిచిపోను. – దీకొండ రజినీ, రాజన్నసిరిసిల్ల జిల్లా
మా ఊర్లో మానసిక దివ్యాంగుల పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్గా పనిచేస్తున్నాను. నెలకు కేవలం రూ.5వేల మాత్రమే వేతనం వస్తుంది. నా భర్త టెక్స్టైల్ పార్కులో కూలీ పనులు చేస్తాడు. ఇద్దరు కలిసి కష్టపడితేనే జీవనం సాగుతుంది. పాఠశాలకు రోజూ ఉదయం 7గంటలకు వెళితే ఇంటికి చేరే సరికి రాత్రి అవుతున్నది. అప్పుడు బస్సులు, ఆటోలు దొరకవు. గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో త్రిచక్రవాహనాన్ని అందించి మం త్రి కేటీఆర్ నా కష్టాలు తీర్చారు. పింఛన్ ఇప్పిస్తే నాకు మరింత ఆసరా అవుతుంది. -చిట్యాల శైలజా, తంగలపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లా
మూసాపేటలో ఓ టైలరింగ్ షాపులో నెల జీతానికి పనిచేస్తున్నాను. బాల్యంలోనే పోలియో రాడంతో కాళ్లు చచ్చుబడిపోయాయి. నాకు భార్య, కుమార్తె ఉన్నారు. పన్నెండు సంవత్సరాల నుంచి టైలరింగ్ చేస్తున్నాను. వచ్చే జీతంతోనే కుటుంబం గడుస్తుంది. నా ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న షాపునకు చేతికర్రల సాయంతోనే నడుచుకుంటూ వెళ్లేవాడిని. ఇక వాటి అవసరం లేదు. నా కష్టాలు తీరినట్లే. మంత్రి కేటీఆర్ నా జీవితాంతం గుర్తుండిపోయే సాయం చేశారు. ఆయనకు కృతజ్ఞతలు.
మాది సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామం. పదోతరగతి వరకు చదువుకున్నాను. కుటుంబ పోషణ కోసం గల్ఫ్కు వెళ్లి అక్కడ కారు డ్రైవర్గా చేరాను. ఇంతో అక్కడ కారు యాక్సిడెంట్కు గురవడంతో నా రెండు కాళ్లను వైద్యులు తొలగించారు. చేసేదేమి లేక స్వగ్రామానికి చేరుకున్నాను. నాటి నుంచి ఇంటికే పరిమితమయ్యాను. నా భార్య జమున రజక వృత్తి చేస్తూ.. సమయం దొరికినప్పుడు బీడీలు చుడుతూ నన్ను, నా ఇద్దరు ఆడపిల్లలను సాకుతున్నది. మంత్రి కేటీఆర్ మా ఊరికి వచ్చినప్పుడు నా దయనీయ స్థితి చూసి తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట కట్టుబడి నాకు ఈ స్కూటర్ను అందించారు. మంత్రి కేటీఆర్ వల్లే నేను 30 సంవత్సరాల తర్వాత బయట ప్రపంచాన్ని చూస్తున్నాను.ఆయనకు మా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుంది. – గుండారపు దేవయ్య, సిరిసిల్ల
అంబర్పేట గోల్నాకలో భార్య మహేశ్వరి, కుమార్తె రష్మి (4), మానస (3)తో అద్దె ఇంట్లో ఉన్నాను. భార్య ఇండ్లలో పనిచేస్తున్నది. పుట్టుకతోనే రెండు కాళ్లు చచ్చుబడిపోవడంతో ఏ పనులు చేసుకోవాలన్నా నా భార్యే సాయం చేస్తున్నది. చిన్న పాపకు ఒక సంవత్సరం వయస్సు ఉన్నప్పుడు ఆమెకు గుండెలో రంద్రం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇప్పుడు పాపకు మూడేండ్ల వయస్సు పూర్తిగా కోలుకోవాలంటే ఆపరేషన్ అవసరమని వైద్యులు తెలిపారు. ఈ కష్ట సమయంలో మంత్రి కేటీఆర్ త్రిచక్రవాహనాన్ని మాకు అందించి జీవితంలో మరిచిపోలేని సాయం చేశారు. నా ఆర్థిక సమస్య తీరడానికి ఈ వాహనం ఎంతో అవసరం పడుతుంది. మా పాప చికిత్సకు కూడా సాయం చేస్తానని మం త్రి హామీ ఇచ్చారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. -బి. రాజు,అంబర్పేట
మాది కుత్బులాపూర్ మండలం, బహదూర్పల్లి గ్రామం. కేపీహెచ్బీలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో అడ్వయిజర్గా పనిచేస్తున్నాను. నిత్యం 15 కిలోమీటర్లు ఆటోలు, క్యాబ్ల్లో వెళ్లేదాన్ని. వచ్చే జీతంలో సగభాగం ప్రయాణ ఖర్చులకే సరిపోయేవి. గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా మంత్రి కేటీఆర్ త్రిచక్రవాహనాన్ని అందించి నా కష్టాలు తీర్చారు. ప్రత్యేక చొరవ చూపించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు కృతజ్ఞతలు. -బి. సునీత, బహదూర్పల్లి గ్రామం, కుత్బుల్లాపూర్ మండలం