వెంగళరావునగర్, జూలై 24: సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉన్నదని టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు డా.ఎస్.ఎంహుస్సేనీ (ముజీబ్) అన్నారు. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా శనివారం గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ దవాఖానలో రోగుల కోసం టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.ఎం.హుస్సేనీ (ముజీబ్) 10 వీల్ చైర్లను బహూకరించారు. ఈ సందర్భంగా హుస్సేనీ మాట్లాడుతూ.మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పేద రోగుల కోసం ఈ దాతృత్వం చేశామన్నారు. ఈ సందర్భంగా హుస్సేనీని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ అభినందించారు. అనంతరం దవాఖాన ఆవరణలోని ఆచార్య జయశంకర్ విగ్రహానికి నేతలు పూలమాల వేసి నివాళులర్పించి మొక్కలు నాటారు. టీఎన్జీఓస్ యూనియన్ నగర ఉపాధ్యక్షులు ఛాతీ దవాఖాన విభాగం అధ్యక్షుడు ఉమర్ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ఖాన్ టీఎన్జీఓస్ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, కార్యదర్శి రాయకంటి ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.