సైదాబాద్, మార్చి 4: విద్యార్థులు వీధి కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మలక్పేట సర్కిల్ డీసీ ఎస్.జయంత్ అన్నారు. శనివారం సైదాబాద్ డివిజన్ పరిధిలోని శంకేశ్వర బజార్ ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారులపై వీధి కుక్కలు దాడులకు పాల్పడకుండా జీహెచ్ఎంసీ సిబ్బంది తగు చర్యలు తీసుకుంటున్నారని, విద్యార్థులు బయటకు వచ్చినప్పడు తగు జాగ్రత్తలు పాటించాలని, వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్ఎంసీ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ మాట్లాడుతూ.. విద్యార్థులు వీధి కుక్కల సంచారం ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, వాటి కండ్లలోకి నేరుగా చూడవద్దని, వెంట పడితే ఆగిపోవాలన్నారు. కుక్కలను అనవసరంగా రెచ్చగొట్టొద్దని వాటి జోలికి వెళ్లొద్దని సూచించారు. అనంతరం వీధుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్, ప్రధానోపాధ్యాయురాలు రేణుక, వాజేద్, టీచర్లులు పాల్గొన్నారు.