సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కల బెడదను నియంత్రించడం,కుక్క కాటు సంఘటనలను పునరావతృతం కాకుండా నిరోధించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ పటిష్ట చర్యలు చేపడుతున్నది. మేయర్ అధ్యక్షత ఏర్పాటైన హై లెవెల్ కమిటీ సిఫార్సు మేరకు యానిమల్ వెల్ఫేర్ బోర్డు మార్గ దర్శకాలను అనుసరించి కీలక నిర్ణయాలను అమలు చేస్తున్నది. ప్రస్తుతం జంతు సంరక్షణ కేంద్రాలు ఫతుల్లాగూడ, చుడీబజార్, పటేల్ నగర్, కేపీహెచ్బీ, మహదేవ్పూర్లో ఉండగా..అదనంగా కాటేదాన్, నల్లగండ్లలో జంతు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం చుడీబజార్లో ఉన్న జంతు సంరక్షణ కేంద్రం ప్రాంగణంలో అదనంగా 850 ఫీట్లు గల షెడ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 20 బోనుల ఏర్పాటు చేయడంతో 80 కుక్కలను వారం రోజులు ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఇక కాటేదాన్లో జంతు సంరక్షణ కేంద్రం మరో వారం రోజుల్లో అందుబాటులోకి రానున్నది. వీటితో పాటు నల్లగండ్లలో మరో పశుసంరక్షణ కేంద్ర నిర్మాణ పనులు ఫ్రీకాస్ట్ పద్ధతిలో శరవేగంగా జరుగుతున్నాయని, వచ్చే నెలలో అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు.
యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఫీడింగ్ సెంటర్లతో పాటు నీటి తొట్లను ఏర్పాటు చేశారు. గ్రేటర్ పరిధిలోని ప్రతి కాలనీల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించి విడతల వారీగా ఏర్పాటు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, ఏడబ్ల్యూఓఎస్, వలంటీర్ల సహాయంతోప్రజాప్రతినిధుల సహకారంతో వేసవిలో వీధి కుక్కల కోసం నీటి కొలను ఏర్పాటుకు చర్యలు తీసుకోగా ఇప్పటివరకు 2453 నీటి కొలనులను (గుంతలు) ఏర్పాటు చేశారు. తద్వారా ఆయా కాలనీలో ఉండే కుక్కలు అక్కడే తిని ఉంటాయని, దీని ద్వారా వాటి గొడవ కాకుండా జనంపై దాడులు చేయకుండా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.