సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. స్వచ్ఛ సర్వేక్షణ్లో మెరుగైన ర్యాంకులే లక్ష్యంగా ప్రతి ఏటా ఎప్పటికప్పుడు సంస్కరణలు చేపడుతున్నది. ప్రజలు చెత్తను బయట వేయకుండా, ఇంటింటికీ వచ్చే స్వచ్ఛ ఆటోల ద్వారానే వ్యర్థాలను సేకరిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఇష్టారీతిలో రోడ్లపై చెత్త వేస్తున్నారు. ఇలా తరచూ చెత్త వేసే ప్రాంతాలను గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు, హెచ్చరికల బోర్డులు పెడుతున్నారు.
ఈ ప్రాంతంలో చెత్త వేసే వారిపై పట్ల నిఘా ఉందని, సదరు వ్యక్తులపై రూ. 1000ల జరిమానా విధిస్తామంటూ బోర్డులు పెడుతున్నారు. పౌరులు సైతం వ్యర్థాలు వేసే వారి పట్ల ఫిర్యాదులు చేయొచ్చని పేర్కొంటూ ఫోన్ నంబర్లను నోటీసు బోర్డులో ప్రస్తావిస్తున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్లో ప్రస్తుతం హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశామని, కొద్ది రోజుల్లో గ్రేటర్ వ్యాప్తంగా చెత్త వేసే ప్రాంతాల్లో ఈ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పౌరులు బాధ్యతగా వ్యవహరించి అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.