సిటీబ్యూరో, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ): తప్పులు లేని ఓటరు జాబితా తయారీకి రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ కోరారు. ఓటర్ జాబితాలో తప్పుల సవరణపై జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీల ప్రతినిధులు తెలిపిన ఓటర్ల జాబితాలోని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్వో, ఈఆర్వోలను ఆదేశించారు.
హైదరాబాద్ జిల్లాలో 4.61 లక్షల ఓటర్ల వివరాలు తప్పులు ఉన్నాయని.. ఇందులో 41,269 మంది వివరాలు సేకరించేందుకు పార్టీల ప్రతినిధులు సహకరించాలన్నారు. ఓటర్ నమోదు ప్రత్యేక క్యాంపెయిన్లో 12147 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రతి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈఆర్వో అధ్యక్షతన ఆర్వోలతో పాటు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరుగుతున్నదన్నారు. గత నెల 26, 27 తేదీత్లో సెప్టెంబర్ 2, 3వ తేదీల్లో జరిగిన ప్రత్యేక సమ్మరి రివిజన్ క్యాంపెయిన్ విశేష స్పందన వచ్చిందని, మరో రెండు తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ ఏర్పాటు చేయాలని అన్ని పార్టీల ప్రతినిధులు జిల్లా ఎన్నికల అధికారిని కోరగా, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి అనుమతితో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు.
ఓటర్ అవగాహనకు బల్దియా పరిధిలో 10 లక్షల మందికి ఆస్తి పన్నుదారులకు సమాచారం చేరవేసినట్లుగా తెలిపారు. విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ శంకరయ్య, జోనల్ కమిషనర్లు వెంకటేశ్, వెంకన్న, ఆర్వోలు, నోడల్ అధికారులు, ఆప్ ప్రతినిధులు డి.సుధాకర్, ఠాకూర్ రాకేష్, సీపీఎం ప్రతినిధి ఎం శ్రీనివాసరావు, కాంగ్రెస్ నుంచి నిరంజన్, రాజేష్ కుమార్, బీఆర్ఎస్ నుంచి డి.కొండారెడ్డి, ఏ కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.