4,688 ట్రేడ్లకు.. 1,219 ట్రేడ్లు మాత్రమే చెల్లింపు
ట్రేడ్ లైసెన్సు ఫీజు వసూలును మెరుగుపరుస్తాం : డీసీ
కాప్రా, ఏప్రిల్ 12 : జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్లో నమోదైన 4,688 ట్రేడ్ల నుంచి ఈ ఏడాది(2021-2022)1219 ట్రేడ్ల నుంచి రూ.కోటి 72,23,957 వసూలైనట్టు అధికార వర్గాలు తెలిపాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు ఏర్పాటు చేయాలంటే ట్రేడ్ లైసెన్సు పొందడం తప్పనిసరి. అయితే చాలా వరకు వ్యాపారాలు, దుకాణాలు జీహెచ్ఎంసీ నుంచి తగిన అనుమతులు పొందకుండానే తమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రతి ఏటా గృహాలకు ఎలాగైతే పన్నులు చెల్లిస్తామో ట్రేడ్ లైసెన్సు ఫీజులు కూడా ప్రతి ఏటా(రెన్యూవల్) పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందే సంస్థలు, ప్రభుత్వ అనుమతులతో నిర్వహించే సంస్థలు, ఓ మోస్తరు బడా వ్యాపారులు, పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు తప్పితే సాధారణ వ్యాపారులు, దుకాణదారులు చాలా మంది వీటిని లైసెన్సులు పొందకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
దీంతో అధికారికంగా ట్రేడ్ లైసెన్సులు పొంది నిర్వహించే ట్రేడ్లు తక్కువగా నమోదవుతున్నాయి. సర్కిల్ పరిధిలోని కాప్రా, ఏఎస్రావునగర్, చర్లపల్లి, మల్లాపూర్, నాచారం తదితర ఆరు డివిజన్లలో ఉన్న 300లకు పైగా కాలనీల్లో కేవలం 4,688 ట్రేడ్లు మాత్రమే నమోదు కావడం ఇందుకు నిదర్శనం. అయితే నమోదైన ట్రేడ్ల నుంచి లైసెన్సు ఫీజు రెన్యూవల్ చేసుకొనే వారు కూడా చాలా తక్కువగానే ఉంటున్నారు. 2022 మార్చి 31 వరకు 1219 ట్రేడ్ల నిర్వాహకులు మాత్రమే తమ లైసెన్సును పునరుద్ధరించుకొని ఫీజును చెల్లించినట్టు అధికార వర్గాలు అందజేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది.
మొత్తం ట్రేడ్లు 4,688.. వసూలైంది 1,219 నుంచి మాత్రమే..
జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్లో నమోదైన 4,688 ట్రేడ్ల నుంచి ఈ ఏడాది(2021-2022)1219 ట్రేడ్ల నుంచి రూ.కోటి 72,23,957 వసూలైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. మిగిలిన 3,469 ట్రేడ్ల నుంచి రూ.4కోట్ల 44లక్షల మేర ట్రేడ్ లైసెన్సు ఫీజు, దీనిపై వడ్డీ రూ.2కోట్ల ఏడు లక్షలు, అన్ని బకాయిలు వాటిపై వడ్డ్దీతో కలిపి రూ.7కోట్ల 87లక్షలు వసూలు కావాల్సి ఉంది. దీన్ని బట్టి కేవలం 26శాతం ట్రేడ్లు మాత్రమే ట్రేడ్ లైసెన్సు ఫీజులు చెల్లించినట్టు స్పష్టమవుతున్నది. సింహ భాగం ట్రేడ్లు తమ లైసెన్సు ఫీజులను రిన్యూవల్ చేసుకొనే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటే జీహెచ్ఎంసీకి ఆర్థికంగా పుష్టి చేకూరుతుంది.
ఫీజు చెల్లించకుంటే చర్యలు తీసుకుంటాం
సర్కిల్లో ట్రేడ్ లైసెన్సు లేకుండా వ్యాపారాలు చేసినా, నిర్ణీత ఫీజు చెల్లించి లైసెన్సు రెన్యూవల్ చేసుకోకున్నా తగిన చర్యలు తీసుకుంటాం. వివిధ కారణాల వల్ల ట్రేడ్ లైసెన్సు ఫీజు వసూలులో జరుగుతున్న జాప్యాన్ని నివారించడంతో పాటు వసూలును మెరుగుపరుస్తాం. క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోపాలను అధిగమించి మరింత ఆదాయం వచ్చేలా చర్యలు చేపడ్తాం.
– ఎన్.శంకర్, డిప్యూటీ కమిషనర్, కాప్రా సర్కిల్