మానవాళి ఆరోగ్యానికి పెను ప్రమాదంగా తయారవుతున్న ప్లాస్టిక్ నిషేధం అమలును మరింత కఠినతరం చేయాలని మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ) తాజాగా నిర్ణయించింది. ప్రభుత్వం పదేపదే చెబుతున్నా, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రజల్లో పెద్దగా మార్పు రావడం లేదు. దీంతో బల్దియా కమిషనర్ చైర్మన్గా వివిధ విభాగాల సమన్వయంతో ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు కాబోతున్నాయి.
ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ వస్తువులు, కవర్లను విక్రయించే వారి భరతం పట్టనున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, కర్ణాటకలలో ప్లాస్టిక్ నివారణకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలు పనిచేస్తుండగా..తాజాగా నగరంలో అమలుకు జీహెచ్ఎంసీ సన్నద్ధమవుతున్నది.
ప్లాస్టిక్ భూతం ఆవహిస్తున్నది. లేచిన దగ్గరి నుంచి పడుకునే వరకు ప్లాస్టిక్ను వాడకుండా ఉండలేని వారు లేరంటే అతిశయోక్తి కాదు. పాలు, కూరగాయలు, టిఫిన్, భోజనం ఏది తేవాలన్నా ప్లాస్టిక్ కవర్లు కావాల్సిందే. ప్రస్తుతం ప్లాస్టిక్ లేనిదే ఏదీ తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. ఎన్నో విపరీతమైన పరిణామాలకు కారణమవుతున్న ప్లాస్టిక్పై నిషేధం విధించి, జీహెచ్ఎంసీ చర్యలు ముమ్మరం చేసినా ప్రజల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ నివారణపై మరింత కఠినంగా వ్యవహరించాలని తాజాగా నిర్ణయించింది. ప్లాస్టిక్ కవర్ల తయారీని అడ్డుకునేందుకు, వినియోగాన్ని నివారించేందుకు త్వరలో జీహెచ్ఎంసీ కమిషనర్ చైర్మన్గా ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయనున్నది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక కసరత్తును పూర్తి చేసింది.
ఈ మేరకు జీహెచ్ఎంసీలో భాగమైన ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్, జోనల్ కమిషనర్లు, పారిశుధ్య విభాగం అదనపు కమిషనర్లతో పాటు కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల, పురపాలక, పరిపాలన, ఉన్నత విద్య, యువజన శాఖ, జిల్లా కలెక్టర్ల సారథ్యంలో టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు కాబోతున్నాయి.
ఈ ప్రతిపాదనను పారిశుధ్య విభాగం ప్రభుత్వానికి అందజేసింది. సర్కారు ఆదేశాల మేరకు త్వరలో టాస్క్ఫోర్స్ బృందాలు ప్లాస్టిక్ నివారణ కోసం రంగంలోకి దిగనున్నాయి. ఎప్పటికప్పుడు కార్యాచరణను రూపొందించడం, అవగాహన, ప్రచార కార్యక్రమాలు, తనిఖీలు, జరిమానాలతో ఫలితాన్ని సాకారం చేయడం టాస్క్ఫోర్స్ లక్ష్యమని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొంటున్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాలపై 2016లో పలు మార్గదర్శకాలు రూపొందించి వాటిని అమలు చేయాలని రాష్ర్టాలను కేంద్రం ఆదేశించింది. ఈ ఏడాది అక్టోబర్ 2న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించడానికి ప్రతిఒక్కరూ చర్యలు తీసుకోవాలని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
అంతేకాదు కేంద్రం 12 ప్లాస్టిక్ వస్తువులను నిషేధించింది. జెండాలు, బెలూన్లు, ఇయర్ బడ్స్, క్యాండీలకు ఉపయోగించే పుల్లలు, స్ట్రాలు, 50 మైక్రాన్ల కన్నా తకువ మందం ఉన్న సంచులు, ప్లాస్టిక్ షీట్లు అతికించి చేసే ప్లేట్లు, గిన్నెలు, చిన్న కప్పులు, ఫోమ్డ్ ప్లేట్లు, బ్యాగులు, చిన్న ప్లాస్టిక్ సీసాలు, ప్యాకింగ్కు ఉపయోగించే షీట్లను నిషేధిత జాబితాలో అధికారులు చేర్చారు.
ఇందులో భాగంగానే ఒక్కో రాష్ట్రం దశల వారీగా నిబంధనలను అందిపుచ్చుకుని వేర్వేరు రూపాల్లో ఆచరణలో పెడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, కర్ణాటకలో ప్లాస్టిక్ నివారణపై ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలు పనిచేస్తుండగా.. తాజాగా హైదరాబాద్ నగరంలో అమలుకు జీహెచ్ఎంసీ సన్నద్ధమవుతున్నది.