ఘట్కేసర్ రూరల్, జూన్ 14: ఎక్సైజ్ సుంకం చెల్లించని లక్షలాది రూపాయల విలువైన మద్యాన్ని అక్రమంగా గోవా నుంచి తరలించి నగరంలో విక్రయిస్తున్న ఐదుగురిని ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. వారివద్దనుంచి రూ.12 లక్షల విలువైన 521 మద్యం సీసాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రంగారెడ్డి రీజియన్ ఎక్సైజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డేవిడ్ రవికాంత్, మేడ్చల్ జిల్లా సూపరింటెండెంట్ అరుణ్కుమార్, మల్కాజిగిరి డిప్యూటీ సూపరింటెండెంట్ ముకుంద్ రెడ్డి వివరాలను వెల్లడించారు. మంగళవారం సాయంత్రం బోడుప్పల్ కార్పొరేషన్ పరిధి బంగారు మైసమ్మ దేవాలయం సమీపంలో ఘట్కేసర్ ఎక్సైజ్ సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహించారు.
బోడుప్పల్కు చెందిన అలగొండ జగదీశ్వర్(54) ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తుండగా గమనించిన ఎక్సైజ్ సిబ్బంది ఆపి తనిఖీ చేశారు. అతడి వాహనంలో ఎక్సైజ్ సుంకం చెల్లించని 10 సిగ్నేచర్ మద్యం బాటిళ్లు దొరికాయి. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. గోవాలో సుంకం చెల్లించని మద్యం బాటిళ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి రాష్ర్టానికి తీసుకువస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. నిందితులు కరీంనగర్ జిల్లాకు చెందిన హరికృష్ణ గౌడ్, పీర్జాదిగూడకు చెందిన జగదీశ్వర్(54), వరంగల్ జిల్లా కు చెందిన ఆముదాల సురేందర్(34), మెదక్ జిల్లాకు చెందిన బుచ్చిగారి శ్రీధర్(29), బోడుప్పల్కు చెందిన పున్నా బాలరాజు(53)ను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఐ మల్లయ్య, ఎస్ఐ శ్రావణి, సిబ్బంది అశోక్, మక్బుల్, వెంకట్ రెడ్డి, రాఘవేందర్, నరేశ్, రాజేశ్, కె.దీపిక, ఎం.దీపికను అధికారులు అభినందించారు.