సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ ) : వినాయక విగ్రహాల నిమజ్జనాలకు కోనేరులే ప్రత్నామ్యాయంగా మారాయి. హుస్సేన్సాగర్, చెరువుల్లో పీవోపీ ప్రతిమలను నిమజ్జనం చేయొవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ తీర్పుపై జీహెచ్ఎంసీ సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. నిమజ్జనంపై తీర్పును సవరించేందుకు ఏసీజే జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ వినోద్కుమార్తో కూడిన ధర్మాసనం నిరాకరించింది. హుస్సేన్సాగర్ని కాలుష్యం చేయమని చెప్పలేమని.. ధర్మాసనం తేల్చి చెప్పింది. పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో బల్దియా నగరవ్యాప్తంగా ఉన్న 25 చిన్నపాటి కోనేరుల్లో నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నది. ఇదే సమయంలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) వేసేందుకు సర్కారు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది.
బెంగళూరు తరహాలో బల్దియా 2017లో 25 చోట్ల నాలుగైదు అడుగుల కోనేరులు (బేబీ పాండ్స్)ను నిర్మించింది. 2018, 2019లో ఎక్కువ శాతం చిన్న విగ్రహాలను వీటిలోనే నిమజ్జనం చేశారు. గతేడాది కరోనా నేపథ్యంలో వినాయక ఉత్సవాలు జరుగలేదు. ఈ ఏడాది హైకోర్టు తీర్పు నేపథ్యంలో చిన్న విగ్రహాలతో పాటు భారీ విగ్రహాలను సైతం ఈ కోనేరుల్లోనే నిమజ్జనం చేసేలా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం వాటి వద్ద క్రేన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుత ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం ఎత్తు 40 అడుగులు. ఈ విగ్రహాన్ని కోనేరులో నిమజ్జనం చేయడం సాధ్యం కాదు. వీటితో పాటు బాలాపూర్, చప్పల్బజార్ నుంచి ఐదు అడుగులు అంతకంటే పెద్ద విగ్రహాలు నగర వ్యాప్తంగా దాదాపు 50వేలకు పైగా ఉంటాయి. వీటిని ఒక్కరోజులో, అందులోనూ కోనేరులో నిమజ్జనం సాధ్యమా అన్న దానిపై అధికారులు విస్తృతంగా అధ్యయనం చేస్తున్నారు. జలవిహార్ పక్కన, సంజీవయ్య పార్కు సమీపంలోని కోనేర్లు(బతుకమ్మ ఘాట్లు) కొంచెం పెద్దగా ఉన్నాయి.
40 అడుగల విస్తీర్ణంలో కోనేరు ఉందని, ఇందులో భారీ గణనాథులను ఒకే సారి, ఒకే రోజు కాకుండా సమయాన్ని బట్టి నిమజ్జనం ప్రక్రియను జరిపేలా సన్నాహాలు చేస్తున్నారు. 15 ఫీట్ల వరకు నీటిని నింపి, ఈ కోనేరు చుట్టూ భారీ క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నపాటి విగ్రహాలను ఎక్కడికక్కడ నిమజ్జనం చేయిస్తామని, భారీ విగ్రహాలపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని, ప్రభుత్వ ఆదేశానుసారం నడుచుకుంటామని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.