వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని ఇక సులువుగా వేగంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం పోలీసులు సాంకేతికతను వినియోగిస్తున్నారు. గత ఏడాది వరకు క్రేన్లలో విగ్రహాలను, పీటపై మనుషులను నిల్చోబెట్టి వారి సాయంతో నిమజ్జనం చేసేవారు. ఇందుకు భిన్నంగా ఈ సంవత్సరం కొత్త విధానాన్ని అవలంబించనున్నారు. ఇంటలిజెన్స్ విభాగంలో ఐజీగా పని చేస్తున్న రాజేశ్కుమార్కు ఈ ఆలోచన రాగా.. సోమవారం ట్యాంక్బండ్పై ట్రయల్ రన్ నిర్వహించారు. సీపీ అంజనీకుమార్, అదనపు సీపీ చౌహాన్, సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ హాజరై పరిశీలించారు. మంచి ఫలితం వచ్చినట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఈ విధానంలో నిమజ్జనాన్ని వేగంగా చేయవచ్చన్నారు. ఒక్కో క్రేన్ వద్ద ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు సమయం ఆదా అవుతుందని చెప్పారు. ఇదిలా ఉంటే నాలుగు సంవత్సరాల క్రితం నిమజ్జనం కోసం క్విక్ రిలీజ్ డివైస్(క్యూఆర్డీ)ని అధికారులు అందుబాటులోకి తెచ్చారు. అయితే క్యూఆర్డీని తయారు చేసిన మురళీధర్కే ఈ నూతన విధానాన్ని అమలు చేసే బాధ్యతను అప్పగించారు.
ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలకు నగరం సిద్ధమవుతున్నది. పది రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా పోలీస్ శాఖ, జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నది. నగర వ్యాప్తంగా నిమజ్జనాల కోసం 106 స్టాటిక్ క్రేన్లు, 208 మొబైల్ క్రేన్లు వినియోగించనున్నారు. ఒక్క హుస్సేన్సాగర్ వద్దే దాదాపు 55 పెద్ద క్రేన్లను (స్టాటిక్) ఏర్పాటు చేస్తున్నారు.