సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో వినాయక నిమజ్జన కోలాహలం ఊపందుకున్నది. భారీ గణనాథుల నిమజ్జనంపై సందిగ్ధత నెలకొన్న తరుణంలో చిన్న చిన్న విగ్రహాలను కొలనుల వైపు తరలిస్తున్నారు. విశేషంగా పూజలందుకున్న గణనాథులను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోనేరుల (బేబీ పాండ్స్)కు భక్తులు తరలిస్తున్నారు. ప్రధానంగా పీవీ మార్గ్లోని జలవిహార్ పక్కన ఉన్న కోనేరులో నిమజ్జనం చేసేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. దీంతో హుస్సేన్సాగర్ తీరంలో గణనాథుల సందడి నెలకొన్నది.
హుస్సేన్సాగర్, చెరువుల్లో పీఓపీ(ప్లాస్టర్ ఆఫ్ పారిస్)తో చేసిన రంగు విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని హైకోర్టు తీర్పును ఇవ్వడం, గురువారం వెలువడే సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉంటుందోనని ఎదురుచూస్తున్నారు. మరికొందరు మాత్రం పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ముందుగానే గణనాథులను పీవీ మార్గ్ తీరానికి తరలిస్తున్నారు. అధికారులు మాత్రం కోనేరులోనే పీవోపీ విగ్రహాలతో పాటు ఎకో ఫ్రెండ్లీ గణనాథులను నిమజ్జనం చేయిస్తున్నారు. ఈ కోనేరుల వద్ద ప్రత్యేక క్రేన్లను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. విగ్రహాలు, వాటికి సంబంధించి అవశేషాలు, పూలు పత్రి ఇతర వ్యర్థాలను హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ యంత్రాంగం వెంట వెంటనే తొలగిస్తున్నది.
హుస్సేన్సాగర్, చెరువుల్లో పీఓపీతో చేసిన రంగు విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని హైకోర్టు తీర్పును వెలువరించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అత్యవసర విచారణకు స్వీకరించాలని సీజేఐ బెంచ్ని కోరింది. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ ఫిటిషన్పై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ గురువారం విచారిస్తామని పేర్కొనడంతో నేటి తీర్పుపై భక్తులు, నగరవాసుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం ఎత్తు 40 అడుగులు ఉంది. ఈ విగ్రహాన్ని జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కోనేరులో నిమజ్జనం చేయడం సాధ్యం కాదు. బాలాపూర్, చప్పల్బజార్, తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భారీ విగ్రహాలు నగర వ్యాప్తంగా దాదాపు 50వేలకు పైగానే ఉంటాయి. వీటిని ఒక్కరోజులోనే కోనేరులో నిమజ్జనం చేయడం సాధ్యం కాదన్న చర్చ విస్తృతంగా జరుగుతుంది. ఈ తరుణంలో అందరి చూపు సుప్రీం కోర్టు తీర్పుపై ఉండటం గమనార్హం.