సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : గజ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు జాతీయ అవార్డులు వరించాయి. ఇండియన్ సొసైటీ ఫర్ ట్రెంచ్లెస్ టెక్నాలజీ ఢిల్లీలో నిర్వహించిన 12వ ‘డిగ్షో’లో ఉత్తమ ప్రాజెక్టు నిర్వహణ, ఉత్తమ ప్రాజెక్టు విభాగాల్లో గజ సంస్థకు పురస్కారాలు లభించాయి. ఇండియన్ సొసైటీ ఫర్ ట్రెంచ్లెస్ టెక్నాలజీ జ్యూరీ సభ్యులు గజ సంస్థ సీనియర్ మేనేజర్ ఎస్. శ్రీనివాసరావుకు ఈ అవార్డు అందజేశారు.
తాగునీటి పైపులైన్లు వేసేందుకు కొన్ని చోట్ల భూమిని తవ్వే వీలు లేని పరిస్థితుల్లో ట్రెంచ్లెస్ టెక్నాలజీ సహాయంతో భూమి లోపలి నుంచి పైపులను పంపించి వేరే చోట తాగునీటి పైపులైన్కు అనుసంధానిస్తారు. ఐటీ కారిడార్కు నీటి లభ్యతను పెంచుతూ మేడ్చల్ సమీపంలోని ఘన్పూర్ నుంచి పటాన్చెరు మధ్య 45 కిలోమీటర్ల మేర దాదాపు రూ. 350కోట్లతో సదరు గజ సంస్థ పైపులైన్లు వేసింది. జలమండలికి సంబంధించిన ఈ పనిని 16 అక్టోబర్ 2017లో చేపట్టి 6 మే 2019లో 1800 ఎంఎం డయా పైపులైన్ విస్తరణ పనులను పూర్తి చేశారు. గజ సంస్థకు అవార్డులు రావడం సంతోషంగా ఉన్నదని ఎండీ వీవీఆర్ రాజు ఈ సందర్భంగా తెలిపారు.