తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 22 : మహాభారతం విశిష్టతను నేటి తరానికి తెలియజేయాలని యువభారతి చేపడుతున్న మహాభారతోపన్యాస లహరి కార్యక్రమం ఎంతో గొప్పదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి అన్నారు. నఫీజ్ రెసిడెన్సీలో గల రమణాచారి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగు మహాభారత సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించనున్న మహాభారతోపన్యాస లహరి కార్యక్రమ ఆహ్వాన పత్రికను రమణాచారి ఆవిష్కరించి మాట్లాడారు. మోతీనగర్లో గల శృంగేరి శారదా శంకరమఠం ప్రాంగణంలో డిసెంబర్ 24 నుంచి 31వరకు నిర్వహించనున్న తెలుగు మహాభారత సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువ భారతి అధ్యక్షుడు ఆచార్య ఫణీంద్ర, తదితరులు పాల్గొన్నారు.