తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడిన మాట తప్పలేదు. చేసిన వాగ్దానాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామని స్పష్టంగా ప్రకటించింది. సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్లకు ప్రతి నెలా 250 యూనిట్ల వరకు ఉచితంగానే విద్యుత్ ఇస్తున్నట్టు.. సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అపార్ట్మెంట్లు, కాలనీలు, వీధుల్లో ఏర్పాటు చేసిన దాదాపు 20వేల లాండ్రీలు, 52 ధోబీఘాట్లకు ఉచిత విద్యుత్ వర్తించనున్నది. తద్వారా ఒక్కో ధోబీఘాట్ పరిధిలో 250 మందికి పైగా బట్టలు ఉతికే వారికి కలిపి మొత్తం లక్షన్నర మందికి ప్రయోజనం దక్కనున్నది. అదే విధంగా 25వేలకు పైగా క్షౌరశాలలు (సెలూన్లకు) ఈ పథకం వర్తించడంతో దాదాపు 75వేల మంది నాయీబ్రాహ్మణ వృత్తిదారులకు ప్రయోజనం చేకూరనున్నది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రజక, నాయీ బ్రాహ్మణ వృత్తిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోని క్షౌరశాలలు, ధోబీఘాట్లు, ల్యాండ్రీ షాపులకు ప్రతినెలా 250 యూనిట్ల ఉచిత విద్యుత్ను సరఫరా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు జీవో జారీ చేయడంతో నాయీ బ్రాహ్మణ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. సోమవారం అల్వాల్ సర్కిల్ పరిధిలోని నాయీ బ్రాహ్మణ సంఘం సభ్యులు మిఠాయిలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షుడు విష్ణునాయీ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల వారికి సమన్యాయం కల్పిస్తున్నారన్నారు. ప్రభుత్వం నిర్ణయంతో నగరంలోని క్షౌరశాలలు ఆధునిక హంగులు దిద్దుకోవడం ఖాయమన్నారు. కనీస యూనిట్లతో సంబంధం లేకుండా క్షౌరశాలలకు నెలకు 250 యూనిట్ల విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. 50 ఏండ్లు నిండిన నాయీ బ్రాహ్మణులకు నెలకు రూ.5 వేల పింఛను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు విష్ణు, శ్యామ్, అశ్విన్, కుమార్, సుమన్, నర్సింగ్, జాన్పాల్, సాగర్, రాజు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల పక్షపాతి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమ పథకాలతో రాష్ర్టాన్ని ముందు వరుసలో నిలబెడుతున్నారు. గిరాకీలు లేక ఇబ్బందులు పడుతున్న నాయీ బ్రాహ్మణుల కష్టాలు తీర్చే నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది. మా జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్కు అండగా నిలుస్తాం. – మల్యాల బాలయ్య, రామంతాపూర్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు
నాయీ బ్రాహ్మణులను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్దే. గతంలో రజకులను ఎవరూ పట్టించుకోలేదు. అష్టకష్టాలు పడుతున్నా ఆదుకున్న వారు లేరు. సీఎం కేసీఆర్ క్లిష్ట పరిస్థితులను గమనించి ప్రతి నెల 250 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చి విశాల హృదయాన్ని చాటుకున్నారు. సీఎం కేసీఆర్కు రజకులమంతా జీవితాంతం రుణపడి ఉంటాం. – గడియారం రామకృష్ణ, కాప్రా నాయీబ్రాహ్మణ సంఘం సభ్యుడు
సీఎం కేసీఆర్ పేదల సంక్షేమం కోసం నిరంతరం పరితపిస్తున్నాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం ఆనందంగా ఉంది. రాష్ట్రంలోని సబ్బండవర్గాలు సీఎం కేసీఆర్ వెంటే ఉంటారు. ముఖ్యంగా ఉద్యమ నేత మేలును రజకులు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. – మొగిలి లింగం, రామంతాపూర్
కాచిగూడ, ఏప్రిల్ 5: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లాండ్రీలు, ధోబీఘాట్లకు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ 250 యూనిట్ల ఉచిత విద్యుత్ను ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య అన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం ఆయన కాచిగూడలో విలేకరులతో మాట్లాడారు. వృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలని ఎన్నోసార్లు మొర పెట్టుకున్నా సమైక్య పాలకులు కనికరించలేదన్నారు. బాంధవుడిలా సీఎం కేసీఆర్ వచ్చి నాయీ బ్రాహ్మణుల జీవితాల్లో వెలుగులు నింపడం ఆనందంగా ఉందన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ స్థలాల్లో ధోబీఘాట్లను నిర్మించేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 50 ఏండ్లు నిండిన రజకులకు పింఛన్లు, ఆరోగ్య బీమా వర్తింపజేయాలని కోరారు. కార్యక్రమంలో గుమ్మడి రాజునరేష్, సింహాచలం, రామ్మూర్తి, వీరబాబు, గణేశ్, వెంకన్న, రమణ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్కి నాయీ బ్రాహ్మణులంతా రుణపడి ఉంటారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఆనందంగా ఉంది. గత ప్రభుత్వాలు నాయీ బ్రాహ్మణులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయి. ఏనాడు మా అభివృద్ధిని పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని రెండున్నర లక్షల మంది నాయీ బ్రాహ్మణులకు ప్రయోజనం చేకూరడం ఖాయం. తెలంగాణ సాధన తర్వాత నాయీ బ్రాహ్మణులు ఆర్థికంగా, సామాజికంగా ప్రగతి సాధించేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. – పెంబర్తి శ్రీనివాస్రావు, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో లాభం చేకూరింది. ఒకప్పుడు కార్పొరేట్తో పోటీ పడలేక సెలూన్లు మూసుకునే పరిస్థితి ఉండే. ఎన్నో ఏండ్లుగా సెలూన్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఉద్యమాలు చేశాం. సమైక్య రాష్ట్రంలో పట్టించుకున్న నాథుడే లేకుండే. 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం ఎంతో ఊరట కలిగించే అంశం. సీఎం కేసీఆర్ మనసున్న మారాజు. ఎవరికి ఏది కావాలో ఇచ్చే గొప్ప మనసున్న నాయకుడు. – గడల రాజు, తెలంగాణ నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
రజకుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. సమస్యలను గుర్తించడంతో పాటు వారి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం అభినందనీయం. ముఖ్యంగా ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం మరిచిపోలేనిది. -పెద్దపురం కుమార్స్వామి, తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ ప్రభుత్వం రజక వృత్తిదారులకు బాసటగా నిలుస్తుండటం సంతోషంగా ఉంది. ధోబీఘాట్లు, లాండ్రీషాపులు, సెలూన్లకు ఉచిత విద్యుత్ సరఫరా అమలుకు వెంటనే క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ సహకారాన్ని ఎన్నటికీ గుర్తుంచుకుంటాం. – బొడ్డుపల్లి కృష్ణ, తెలంగాణ రజక వృత్తిదారుల రాష్ట్ర సమితి కార్యదర్శి
ఇచ్చిన హామీని గుర్తుంచుకొని సీఎం కేసీఆర్ అమలు చేయడం సంతోషంగా ఉంది. కులవృత్తులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం మంచి పరిణామం. స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని ఏండ్లలో ఏ ప్రభుత్వం కుల వృత్తులను ఆదుకున్న దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం దక్కుతుంది. ముఖ్యంగా రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నందుకు సంతోషం. -గోల్కొండ శంకర్, మహేశ్వరం పట్టణ రజక సంఘం అధ్యక్షుడు
సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్లకు ఉచిత కరెంట్ ఇచ్చి ఆదుకున్న సీఎం కేసీఆర్ను గుండెల్లో పెట్టి కొలుస్తాం. 250 యూనిట్ల ఉచిత కరెంట్ సరఫరాతో ఎందరో రజకులకు లాభం చేకూరడం ఖాయం. ఎన్నో కష్టాల్లో ఉన్న సమయంలో దేవుడిలా ఆదుకున్న సీఎం కేసీఆర్ను ఎన్నటికీ మరువం. -పంజగారి ఆంజనేయులు, రాష్ట్ర రజక సంఘాల జేఏసీ చైర్మన్