– నిందితుల నుంచి రూ.89వేల నగదు,
-బైక్, సెల్ఫోన్లతో పాటు పలు పరికరాలు స్వాధీనం
సికింద్రాబాద్ : చాటుమాటుగా అందర్ బహార్ జూదం ఆడుతున్న నలుగురు నిందితులను తుకారాంగేట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. గురువారం నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, గోపాలపురం ఏసీపీ సుధీర్, తుకారాంగేట్ సీఐ ఎల్లప్ప, డీఐ అంజనేయులు సంఘటనకు సంబందించి వివరాలు వెల్లడించారు.
చట్ట వ్యతిరేకంగా అందర్ బహార్ కార్డుల జూదం ఆడుతున్నారన్న సమాచారం మేరకు తుకారాంగేట్ సీఐ ఎల్లప్ప పర్యవేక్షణలో డీఐ ఆంజనేయులుతో పాటు తన క్రైమ్ బృందం ఈనెల 19న ఈస్ట్ మారేడుపల్లిలోని గోల్డెన్ బేకరీ వద్ద జూదం ఆడుతున్న సయ్యద్ ఇంతియాజ్, దోతి రమేష్, ఓర్పు యాదగిరి, అన్న కుమార్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
నిందితుల నుంచి రూ.89 వేలు నగదు, గ్యాంబ్లింగ్కు ఉపయోగించే 52 కార్డులు, రెండు సెట్లు సిస్టమ్ కార్డులను రెండు సెల్ఫోన్లు, యాదగిరి నుంచి బైకు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వారిచ్చిన సమాచారం తో చాంద్రాయణగుట్టకు చెందిన ఆసిఫన్ ( 46), కాలపత్తార్కు చెందిన మహ్మద్ ఆఫ్రోజ్ ( 36), ఫలక్నుమాకు చెందిన మోహమ్మద్ అర్షద్ (22), మేడ్చల్ నాచారంకు చెందిన మెల్విన్ (22)లను అరెస్ట్ చేశారు.
కాగా ఈ సందర్భంగా జూదానికి వినియోగించే నాలుగు లక్షల విలువైన సాంకేతిక యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.