బోడుప్పల్, సెప్టెంబర్ 29: అభివృద్ధికి సహకరించాల్సిన ప్రతిపక్షాలే ప్రగతి నిరోధకులుగా మారి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం బోడుప్పల్లో రూ.4.28 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మేయర్ బుచ్చిరెడ్డి, స్థానిక కార్పొరేటర్లతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంటుందన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఏజెండగా అహర్నిషలు కృషిచేస్తున్న బీఆర్ఎస్కు మరోసారి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలను కేంద్రం కాఫీ కొడుతూ కాలం వెల్లదీస్తుందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకుపోతుందని… పలు సర్వేలన్నీ వెల్లడిస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలకు తెలంగాణలో స్థానం లేదని, మా విజయాన్ని అడ్డుకుంటామంటున్న ప్రత్యర్థులకు కనీసం డిపాజిట్ కూడా రాదన్నారు.
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ పరిధిలోని బొల్లిగూడెంలో రూ.84.50లక్షల నిధులతో బీటీ రోడ్డు నిర్మాణం, రూ.కోటి నిధులతో టెలిఫోన్ కాలనీ హైటెన్షన్ లేన్ రోడ్డు నిర్మాణం, 1వ డివిజన్ నుంచి 15డివిజన్ బొల్లిగూడెం వరకు రూ.93.50లక్షల నిధులతో ప్రధాన రహదారి బీటీరోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.కోటి నిధులతో గాయత్రీ హిల్స్ నుంచి చిలుకానగర్ ప్రధాన రహదారి వరకు బీటీ రోడ్డు పున:నిర్మాణం, మరియు 11వ డివిజన్ పరిధి తిరుమల మెడోస్ కాలనీ సమీపంలో రూ.30లక్షలతో నిర్మించనున్న ఛట్ పూజా ఘాట్ నిర్మాణ పనులకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.
బోడుప్పల్ సీనియర్ సిటిజన్ భవన్ ఏర్పాటుకు సొంత నిధులతో భవన నిర్మాణానికి కృషి చేస్తుంటే ఆ కార్యక్రమాన్ని స్థానిక కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకోవాలని చూడటం హేయమైన చర్య అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటే అరెస్ట్లు తప్పవని హెచ్చరించారు. 23 సంవత్సరాలుగా నలుగుతున్న సమస్యను పరిష్కరించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభినందించాలి కానీ అడ్డుకుంటారా? అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, కమిషనర్ జి.వేణుగోపాల్రెడ్డి, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు మంద సంజీవరెడ్డి, మీసాల కృష్ణ, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, స్థానిక నాయకులు రాంచంద్రారెడ్డి, రవిగౌడ్, చక్రపాణిగౌడ్, గుర్రాల వెంకటేశ్, సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు సాయిబాబా, విశ్వనాథ్ శత్రజ్ఞ, కీర్తన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.