లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టింది. అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడి నుంచే కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభిస్తూ వస్తుండగా..బీఆర్ఎస్ సైతం లోక్సభ ఎన్నికల్లో అదే అస్ర్తాన్ని ప్రయోగించింది. వైఎస్ గెలుపునకు చేవెళ్ల సెంటిమెంట్గా నిల్వగా..గత అసెంబ్లీ ఎన్నికల్లో, తాజా లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చేవెళ్ల వేదికగా సభలు, సమావేశాలను నిర్వహించి అధికారంలోకి వచ్చింది. బీజేపీ పార్టీ సైతం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే ప్రాంతంలో సభను నిర్వహించింది. జాతీయ స్థాయి నేతలు సైతం ఈ సభల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు చేవెళ్ల సెంటిమెంట్గా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం లోక్సభ ఎన్నికల్లో ఇదే సెంటిమెంట్ను అనుసరించాలని సంకల్పించి చేవెళ్ల నుంచే లోక్సభ ప్రచారాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించి తొలిసభను ఇక్కడే నిర్వహించారు.
ఈ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో రాష్ట్రం అంతటా బీఆర్ఎస్కు తిరుగు ఉండదని, పార్లమెంటు ఎన్నికల్లో విజయ దుందుభి మోగించడం ఖాయమన్న భావన ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతున్నది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మొదటి నుంచీ ముందుండి నడిపిస్తూ క్యాడర్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతూ వస్తున్నారు. చేవెళ్ల సభ సక్సెస్ కావడంలోనూ కీలకపాత్ర పోషించారు. సభ తేదీ ప్రకటించిన నాటి నుంచే ముఖ్యనేతలతో సమాలోచనలు జరపడమే కాకుండా.. ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ సభ సక్సెస్కు తనవంతు పాత్ర పోషించారు.సభ సక్సెస్ కోసం సన్నాహక సమావేశాలు సైతం నిర్వహించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించారు. ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చి కేసీఆర్కు భరోసా ఇవ్వడంతోపాటు ఎంపీ అభ్యర్థి జ్ఞానేశ్వర్ను ఆశీర్వదించాలని ఇచ్చిన పిలుపునకు జనం స్పందించి అశేషంగా తరలివచ్చారు.