సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి ఎలాంటి అంతరాయం ఉండదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. శనివారం స్విగ్గీ, జొమాటో తదితర ఫుడ్ డెలివరీ బాయ్స్ను రోడ్లపై నిలిపివేయడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి ఎలాంటి అంతరాయం ఉండదని డీజీపీ మహేందర్రెడ్డి ట్విటర్ ద్వారా స్పష్టత ఇచ్చారు. మూడు కమిషనరేట్ల పోలీసు ఉన్నతాధికారులు సైతం సోమవారం నుంచి ఈ విధానానికి ఎలాంటి ఆటంకాలు ఉండవన్నారు. అయితే డెలివరీ బాయ్స్ నిబంధనలను ఉల్లంఘించే విధంగా వ్యవహరించినా, ఇతర కార్యకలాపాలకు డ్రెస్సులను ఉపయోగించుకున్నా చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.