సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): వరుస పండుగలతో పూల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో రూ.80లు ఉన్న ధరలు ఒక్కరోజులోనే రూ.200లకు పెరిగింది. సాధారణంగా దసరా, బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా గ్రేటర్తో పాటు శివారు ప్రాంతాల్లో పూల వినియోగం అధికంగా ఉంటుంది. దీంతో అన్ని మార్కెట్లలో నిన్నమొన్నటి వరకు బంతిపూలు కిలో ధర రూ.10 నుంచి రూ.20 ఉండగా ప్రస్తుతం ఈ ధరలు రూ.120 నుంచి రూ.180లకు చేరింది. రెండు రోజుల క్రితం ఉన్న వరకు కిలో రూ.50 నుంచి రూ.80 ఉన్న చామంతి రూ.200 నుంచి రూ.250కి చేరింది. అయితే ఇది హోల్సేల్ ధరలు మాత్రమే. రిటైల్కు వచ్చే సరికి కిలో చామంతి ధర రెట్టింపు అవుతాయి.
సాధారణంగా వినాయక చవితి, దసరా, దీపావళి పండుగల సీజన్లో పూలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ సీజన్లలో ధరలు పెరగడం సాధారణం. అయితే ఈ సారి ఊహించినంత డిమాండ్ కనిపించడం లేదు. మరో రెండు మూడు రోజుల్లో డిమాండ్ మరింత పెరగవచ్చు. అయితే రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, కర్ణాటకలోని చిక్బల్లాపూర్ నుంచి చామంతి, డచ్ లాంటి పూలు మార్కెట్కు వస్తాయి. కర్ణాటకలోని బెంగళూరు నుంచి టైగర్ రోజ్, మల్లెపూలు, హైబ్రిడ్ మల్లెలు ఇక్కడికి వస్తాయి. సాధారణ రోజుల్లో అయితే, ఓవరాల్గా 37 వేల కిలోల నుంచి 47 వేల కిలోల వరకు గుడి మల్కాపూర్ మార్కెట్కు పూలు వస్తాయి. పండుగల సీజన్లో ఇది రెట్టింపు అవుతుంది.