మారేడ్పల్లి, సెప్టెంబర్ 30 : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కిడ్నాప్కు గురైన ఐదు ఏళ్ల బాలుడిని కిడ్నాపర్ల నుంచి రైల్వే పోలీసులు రక్షించారు. బెగ్గింగ్ మాఫియాలో ఉండి సహజీవనం చేస్తున్న ఓ జంటను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయలపురం గ్రామానికి చెందిన దుర్గేశ్ తన ఐదేళ్ల కుమారుడు శివ సాయి (మూగ, చెవిటి)తో కలిసి తిరుపతికి వెళ్లాడు. ఈ నెల 29న శుక్రవారం తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం నం.1కి చేరుకున్నాడు. బాలుడు శివసాయిని లగేజీ బ్యాగ్ వద్ద ఉంచిన తండ్రి దుర్గేశ్ వాష్ రూంకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి శివసాయి కనిపించలేదు. వెంటనే సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్రమత్తమైన రైల్వే పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సీసీ కెమెరా పుటేజీల ద్వారా కిడ్నాపర్లను గుర్తించిన పోలీసులు శనివారం విడుదల చేశారు.
సెల్ ఫోన్ ద్వారా.. బాలుడి ఆచూకీ లభ్యం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కిడ్నాప్కు గురైన బాలుడు శివసాయితో పాటు దుర్గేశ్ లగేజీ బ్యాగ్ను కిడ్నాపర్లు వెంట తీసుకొని వెళ్లారు. అయితే దర్గేశ్ సెల్ఫోన్ బ్యాగులోనే ఉండిపోయింది. దీంతో రైల్వే పోలీసులు సెల్ఫోన్ టవర్ లోకేషన్ ఆధారంగా మాదాపూర్లోని సైబర్ టవర్స్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. రైల్వే పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. సైబర్ టవర్స్ ప్రాంతంలో ఓ బ్రిడ్జి కింద చెట్ల పొదల్లో ఉన్న బాలుడిని పోలీసులు చేరదీసి చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు.
టివోలీ ప్రాంతంలో అదుపులోకి..
మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఖలీవలి విక్రమ్(41) భార్యా పిల్లలతో కలిసి బషీర్బాగ్లో నివాసముంటూ జేబీఎస్ ప్రాంతంలోని ఓ హోటల్లో పని చేస్తుండగా విజయవాడ ప్రాంతానికి చెందిన యాచకురాలు షేక్ రెహానా(25) విక్రమ్తో సహజీవనం చేస్తూ మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరిని టివోలీ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.