హైదరాబాద్ : సికింద్రాబాద్ క్లబ్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో క్లబ్ అంతటా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మంటలను అదుపు చేసేందుకు 10 అగ్నిమాపక యంత్రాలు తీవ్రంగా శ్రమించాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి మంటలను అదుపు చేశారు. మంటలను అదుపు చేసేందుకు సుమారు 4 గంటల సమయం పట్టింది.
క్లబ్లో అగ్నిప్రమాదం సంభవించడంతో సుమారు రూ. 20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
1878లో బ్రిటీష్ హయాంలో మిలిటరీ అధికారుల కోసం సికింద్రాబాద్ క్లబ్ను నిర్మించారు. భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి 2017లో సికింద్రాబాద్ క్లబ్ పోస్టల్ కవర్ విడుదల చేశారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్లబ్ ఉంది. సికింద్రాబాద్ క్లబ్లో 300 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఈ క్లబ్లో 5 వేల మందికి పైగా సభ్యత్వం ఉంది.