హైదరాబాద్: నగర శివార్లలోని శంషాబాద్లో (Shamshabad) పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ పరిధిలోని రామాంజపూర్లో ఉన్న టింబర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున టింబర్ కంపెనీలో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి మొత్తానికి విస్తరించడంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. విద్యుదాఘాతంతోనే టింబర్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.