Cyber Crime | సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు దోపిడీలు, దొంగతనాలు, దారి దోపిడీలు వంటి ఆర్థిక నేరాళ్లు జరిగేవి. ఈ క్రమంలో భౌతిక దాడులు, హత్యలు వంటివి ఘటనలు కూడా చోటు చేసుకునేవి. కానీ.. మారుతున్న కాలంతో పాటు నేరస్తులు కూడా తమ రూట్ మారుస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో నేరగాళ్లు భౌతికంగా కనిపించకుండానే.. ఎదుటివారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక నేరాల్లో ప్రజల అమాయకత్వం, ప్రధానంగా అత్యాశే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.
తక్కువ పెట్టుబడి పెడితే.. ఎక్కువ రాబడి వస్తుందని నమ్మిస్తూ అమాయకులను నట్టేట ముంచేస్తున్నారు. స్టాక్ మార్కెట్ల పేరిట కొందరు.. తమ కంపెనీల్లో షేర్లు పెట్టి కొంత కాలం ఆగితే అధిక రాబడి వస్తుందంటూ మరికొందరు అమాయక ప్రజలను నమ్మిస్తారు. ఈ క్రమంలో ముందుగా అమాయకులతో తక్కువ పెట్టుబడి పెట్టించి.. తొలుత కొంత లాభాలు ఇస్తున్నారు. కొద్దిపాటి లాభాలకే ఆకర్శితులైన బాధితులు.. నమ్మకంతో లక్షల్లో పెట్టుబడి పెడతారు. సైబర్ నేరగాళ్ల చేతిలో దోపిడీకి గురవుతున్నారు. ఆ తరువాత లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు తమ రూట్ మార్చుకుని కొత్త ట్రెండ్కు తెరలేపారు. దోచుకున్న డబ్బును పోలీసులు ఫ్రిజ్ చేయకుండా ఉండేందుకు అమాయకులను అడ్డంగా బుక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల నగరానికి చెందిన ఒక విద్యార్థిని సైబర్ నేరగాడు అధిక లాభాల పేరుతో ట్రాప్ చేసి.. పీటూపీ ద్వారా నేర పూరితమైన డబ్బును వైట్గా మార్చుకుని అమాయక విద్యార్థిని ఇరికించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నేరగాడు లావాదేవీలు జరిపిన అన్ని బ్యాంక్ ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు.
ఈ మధ్య పెళ్లి సంబంధాల పేరుతో చాలా మంది యువతులను నేరగాళ్లు నిలువునా దోచేస్తున్నారు. కొన్ని సందర్భాలలో యువకులు కూడా మోసపోతున్నారు. మ్యాట్రీమోనీ సైట్ల ద్వారా కొందరు నేరగాళ్లు పెళ్లి సంబంధాల కోసం నిరీక్షిస్తున్న యువతులను లక్ష్యంగా చేసుకుని వారికి మారు పేర్లతో ప్రొఫైల్ను పంపుతున్నారు. మాయమాటలతో నమ్మించి, వలలో వేసుకొని, డబ్బులు దోచుకుంటున్నారు. మరికొందరు నేరగాళ్లు పెళ్లి సంబంధాల పేరుతో పరిచయమై వీడియోకాల్స్ మాట్లాడుతున్నారు. వాటిని స్క్రీన్ రికార్డ్చేయడమే కాకుండా సదరు వీడియోలను అశ్లీల దృశ్యాలుగా మార్ఫింగ్ చేసి యువతులను బ్లాక్మెయిల్ చేసి దోచుకుంటున్నారు.
నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని కొంత మంది నేరగాళ్లు కన్సల్టెన్సీల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొత్త పద్ధతిలో నేరగాళ్లు జాబ్ ఫ్రాడ్ నేరాలకు పాల్పడుతున్నారు. తమ కంపెనీలో ఉద్యోగావకాశాలున్నట్లు నిరుద్యోగులకు మెసేజ్లు పంపి, మోసం చేస్తున్నారు. అమాయకులు తమ వద్ద ఉన్నంత సమర్పించుకుని లబోదిబోమంటున్నారు.
ఈ మధ్య కాలంలో సైబర్ నేరాల ద్వారా మోసపోతున్న వారిలో ఎక్కువ శాతం విద్యావంతులే ఉండటం విచారకరం. వీరిలో కొంత మంది తెలిసీ తెలియక మోసపోతుంటే.. మరికొందరు అత్యాశతో మోసపోతున్నారు. ముఖ్యంగా ఏదైనా కంపెనీలో పెట్టుబడులు పెట్టాలంటే.. ముందుగా ఆ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. గుర్తింపు ఉన్న కంపెనీల్లో మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఆన్లైన్లో సూచించే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టొద్దు. పీటూపీ ట్రాన్జాక్షన్స్ ద్వారా ట్రేడింగ్ చేయవద్దు.
ప్రముఖ కంపెనీల ద్వారానే ట్రేడింగ్ జరపాలి. ముక్కూ.. ముఖం తెలియని వారితో పరిచయాలు ఏర్పర్చుకుని.. వారితో వీడియో కాల్స్ మాట్లాడటం ప్రమాదకరం. అలాంటి వారి బారిన పడితే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలి. నిందితులు బెదిరించినంత మాత్రాన వారికి డబ్బులు పంపకూడదు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావాలి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. సైబర్ నేరగాళ్ల పట్ల నిరంతరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
– శిల్పవల్లి, సైబర్క్రైమ్ డీసీపీ, సైబరాబాద్