సికింద్రాబాద్, జనవరి 21: కరోనా వ్యాప్తి కారణంగా చాలా మందిలో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు బయట పడుతున్నాయి. ఈ క్రమంలో కొవిడ్ వ్యాప్తి తీరు, కట్టడి చర్యలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు శుక్రవారం నుంచి జీహెచ్ఎంసీ, వైద్య, ఆరోగ్య శాఖ, కంటోన్మెంట్ బోర్డు అధికారుల నేతృత్వంలో సికింద్రాబాద్ పరిధిలోని ఐదు డివిజన్లు, బోర్డు పరిధిలోని ఎనిమిది వార్డులు, మోండా డివిజన్లోని ప్రతి కాలనీ, బస్తీల్లోని ప్రతి ఇంటికీ ఆరోగ్య సిబ్బంది వెళ్లి జ్వర సర్వే ప్రారంభించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి అవగాహన కల్పిస్తూ ఆరోగ్య సిబ్బంది ముందడుగు వేస్తున్నారు.
సికింద్రాబాద్ సర్కిల్-29 పరిధిలో 23 టీమ్లు సర్వే..
సికింద్రాబాద్ సర్కిల్-29 పరిధిలో 23టీమ్ల సిబ్బంది ఫీవర్ సర్వే నిర్వహించారు. సీతాఫల్మండి డివిజన్లో నిర్వహించిన సర్వేలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్తో పాటు స్థానిక కార్పొరేటర్ హేమ, డిప్యూటీ కమిషనర్ మోహన్రెడ్డి పాల్గొని పర్యవేక్షించారు. ఆదే విధంగా తార్నాక డివిజన్లో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి ఆరోగ్య సిబ్బందితో కలిసి ఇంటింటి సర్వేలో పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోని ఎంసీహెచ్ క్వార్టర్స్, తుకారంగేట్, ఇంద్రానగర్ బీ కాలనీ, లక్ష్మీనగర్, మాణికేశ్వర్నగర్, తార్నాక స్ట్రీట్ నంబర్లు 7,8,9,10, బతుకమ్మ కుంట, డాబర్ కంపౌండ్, చిలకలగూడ బడీ మసీద్, మైలార్గడ్డ, టీఆర్టీ క్వార్టర్లు, సంజీవపురం ప్రాంతాల్లో 23 బృందాలు 1,794 ఇండ్లలో సర్వే చేశారు. దీంట్లో కరోనా లక్షణాలు 78 మందికి ఉన్నట్లు నిర్ధారించగా, 62 మందికి ఐసోలేషన్ కిట్లను పంపిణీ చేశారు. మరో 18 మందిని వైద్య పరీక్షలకు సిఫారసు చేశారు.
కంటోన్మెంట్లో ముమ్మరంగా ..
కంటోన్మెంట్ పరిధిలోని ఎనిమిది వార్డుల్లో తొలిరోజు శుక్రవారం ఫీవర్ సర్వే ముమ్మరంగా సాగింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రెండవ వార్డు రసూల్పురా, ఐదవ వార్డులోని సంజీవయ్యనగర్లో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్. శర్మన్ ప్రత్యక్షంగా ఇంటింటికీ తిరుగుతూ సర్వేను పరిశీలించారు. ప్రజలందరూ సర్వేకు సహకరించాలని, జ్వరం, కరోనా లక్షణాలున్న వారికి అక్కడికక్కడే హోం ఐసోలేషన్ కిట్లు ఇస్తారని తెలిపారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటి కప్పుడూ పర్యవేక్షణ చేస్తామని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. కంటోన్మెంట్లోని బోయిన్పల్లి, తిరుమలగిరి, పికెట్, బొల్లారం, రసూల్పురా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నేతృత్వంలో 2,314 ఇండ్లల్లో ఫీవర్ సర్వేను 27 బృందాలు చేపట్టగా, 96 మందికి స్వల్ప లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. 84 మందికి ఐసోలేషన్ కిట్లను పంపిణీ చేశారు. మరో నాలుగు రోజుల్లో డ్రైవ్ను పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. నోడల్ అధికారుల పర్యవేక్షణలో బోర్డు సిబ్బంది, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ఫీవర్ సర్వే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.
తార్నాక డివిజన్లో..
ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 21: తార్నాక డివిజన్లో శుక్రవారం నిర్వహించిన ఇంటింటికీ ఫీవర్ సర్వేలో నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి పాల్గొన్నారు. డివిజన్లోని పలు ప్రాంతాల్లో సర్వే చేస్తున్న ఆశ వర్కర్లు, ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి విస్తృతంగా పర్యటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజారోగ్యమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం సాగుతోందని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి సర్వే జరుపుతున్నారని చెప్పారు. హోం ఐసోలేషన్, కరోనా టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. లక్షణాలు ఉన్నవారికి కరోనా కిట్లు సైతం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.