Crime News | హయత్నగర్, ఫిబ్రవరి 28 : ఆస్తి విషయంలో కుమారుడిని తండ్రి హత్య చేశాడు. ఈ ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఇన్స్పెక్టర్ జి.రామకృష్ణ, స్థానికుల కథనం ప్రకారం.. చౌటుప్పల్, దండు మల్కాపురం గ్రామానికి చెందిన కలగోని శ్రీనివాస్ గౌడ్ రెండో భార్యతో కలిసి అబ్దుల్లాపూర్మెట్ మండలం ద్వారకామయినగర్ కాలనీలో ఉంటున్నాడు. మొదటి భార్య కుమారుడు వినయ్కుమార్ గౌడ్(28) కారు డ్రైవర్. వినయ్కుమార్ గౌడ్.. భార్య ప్రవళిక, కూతురు రక్షితతో కలిసి మునగనూరులో ఉంటున్నాడు. శ్రీనివాస్గౌడ్కు దండు మల్కాపురంలో ఉన్న 30 గుంటల భూమిలో వెంచర్ చేసేందుకు ఇతరులతో ఒప్పందం చేసుకున్నాడు.
అయితే, వచ్చిన డబ్బులో నుంచి ఇంటి నిర్మాణం కోసం తనకు కొంత ఇవ్వాలని వినయ్కుమార్ తన తండ్రి శ్రీనివాస్ గౌడ్ను అడిగాడు. ఈ విషయంలో కొంత కాలంగా తండ్రి, కుమారుడి మధ్య గొడవలు జరుగుతున్నాయి. వినయ్కుమార్ గౌడ్ మంగళవారం రాత్రి కూడా తండ్రి ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి శ్రీనివాస్గౌడ్ పారతో వినయ్ కుమార్ గౌడ్ తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో వినయ్ కుమార్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే హయత్నగర్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. భార్య ప్రవళిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు శ్రీనివాస్ గౌడ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.