చార్మినార్, జూన్ 8 : అప్పటికే అతడికి వివాహం జరిగింది.. మరో అమ్మాయిపై కన్నేసి ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు పాల్పడ్డాడు.. అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జైలుకు వెళ్లి.. బయటకు వచ్చి యువతిని దొంగచాటుగా పెండ్లి చేసుకున్నాడు. నిఖా జరిగిన తరువాత నా భార్యను పంపండంటూ యువతి తండ్రికి హెచ్చరికలు జారీ చేశాడు. దీన్ని తట్టుకోలేక ఆ యువతి తండ్రి.. అతడిని ఇంటికి పిలిపించి హత్య చేశాడు. ఈ ఘటనలో నిందితుడిని మంగళవారం ఫలక్నుమా పోలీసులు అరెస్ట్ చేశారు.
డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దక్షిణ మండల డీసీపీ గజరావ్ భూపాల్ వివరాలు వెల్లడించారు.. ఫలక్నుమా పోలీస్స్టేషన్ పరిధిలోని వట్టేపల్లి ప్రాంతానికి చెందిన సయీద్ అన్వర్ కుమార్తెను అదే ప్రాంతానికి చెందిన అబ్దుల్ షారుఖ్ (24) కొంత కా లంగా ప్రేమిస్తున్నాడు. అతడికి అప్పటికే వివాహం అయ్యింది. ఈ విషయం తెలిపిన అన్వర్.. తన కూతురు వెంటపడవద్దని షారుఖ్ను మందలించాడు.. అయినా.. కూతురితో సన్నిహితంగా ఉంటున్నాడు.. దీంతో అన్వర్.. తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ గత ఆరు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశా డు. అప్పట్లో పోలీసులు షారుఖ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
జైలు నుంచి బయటకు వచ్చిన షారుఖ్ గత రెండు నెలల క్రితం అన్వర్ కుమార్తెను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. పెండ్లి జరిగిందని.. తన భార్యను ఇంటికి పంపించాలని అన్వర్ కుటుంబ సభ్యులను బెదిరించాడు. దీన్ని జీర్ణించుకోలేని అన్వర్.. వివాహ విషయం చర్చిద్దామంటూ షారుఖ్ను ఇంటికి ఆహ్వానించాడు. చర్చల అనంతరం షారుఖ్ తిరిగి వెళ్లే క్రమం లో అన్వర్.. షారుఖ్ ద్విచక్ర వాహనంపై కలిసి వెళ్లాడు. ఫలక్నుమా పోలీస్స్టేషన్ సమీపంలోకి వస్తున్న సమయంలో అన్వర్..కత్తితో షారుఖ్ గొంతు కోసం హత్య చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి.. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేశారు. సమావేశంలో ఫలక్నుమా ఏసీపీ మహ్మద్ మాజీద్, ఇన్స్పెక్టర్ దేవేందర్ తదతరులు పాల్గొన్నారు.