ఆపద సమయంలో ఆదుకునే వారి కోసం బాధితులు పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. చివరి నిమిషంలో ప్రాణాలు కాపాడుకోవాలనే ఆలోచనతో సేవా మూర్తుల కోసం ఎదరుచూస్తుంటారు. ఓ వైపు వైద్యులు డెడ్లైన్ విధించి బ్లడ్, ప్లాస్మా, ఇంజక్షన్ కావాలని చెబుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాస్మా, రెమిడెసివర్కు డిమాండ్ చాలా ఉంది. ఈ కొవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో చాలా మంది వాటి కోసం సోషల్ మీడియానే ఆశ్రయిస్తున్నారు. చాలా మంది రక్తం, ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధమంటూ ఫోన్ నంబర్లతో కూడిన సమాచారాన్ని విరివిగా షేర్ చేస్తున్నారు. వందల నంబర్లు ఆ లిస్టులో ఉంటున్నాయి. బాధితులు ఆ సమాచారాన్ని చూసి ఊపిరిపీల్చుకుని నంబర్లకు ప్రయత్నిస్తే ఆ నంబర్లు పని చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
వందల నంబర్లలో ఒక్క నంబర్ పని చేయదా అనే ఆశతో అన్ని నంబర్లకు కాల్ చేస్తున్నారు. కానీ అందులో ఏ ఒక్క నంబర్ కలవడం లేదు. రింగ్ అయినా.. లిఫ్ట్ చేయడం లేదు. పదే పదే ఫోన్ చేసి బాధితులు ఆశలు వదులుకుంటున్నారు. అనవసరంగా వారి విలువైన సమయం వృథా చేసుకుంటున్నారు. నెటిజన్లు ఫేక్ నంబర్లను గుడ్డిగా వైరల్ చేయకుండా సరైనవా? కావా? అని పరిశీలించాకే షేర్ చేయాలని ఐటీ నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలని.., నిజంగా సేవ చేసే వారి వివరాలను మాత్రమే షేర్ చేయాలని తెలుపుతున్నారు. ఒకవేళ ఆ సమయంలో ఇవ్వడం కుదరని వాళ్లు ఫోన్ లిఫ్ట్ చేసి విషయం తెలియజేయాలని లేదా మెస్సేజ్ చేయాలని సూచించారు.