వెంగళరావునగర్, అక్టోబర్ 6: వెండి ఉంగరాలకు బంగారం పూత పూసి హాల్మార్క్ ముద్రలు వేసి నగర వ్యాప్తంగా పాన్ బ్రోకర్ వ్యాపారులను మోసం చేసిన ఘరానా ముఠాను ఎస్ఆర్నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. కర్నూలుకు చెందిన భాస్కర్ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించినట్లు సమాచారం. కర్నూల్కు చెందిన భాస్కర్ బోరబండలోని మోతీనగర్లో గతంలో బంగారం దుకాణం నిర్వహించేవాడు. ఆ సమయంలో అతని వద్ద పనిచేసే హరివర్ధన్తో కలిసి పథకం రచించాడు. వెండి ఉంగరాలకు బంగారం పూత పూసి, వాటిని తన గ్యాంగ్ సభ్యుడైన కుమార్ ద్వారా హాల్మార్క్ ముద్రలు వేయించాడు.
అనంతరం ముఠాకు చెందిన వెంకట్రెడ్డి పాన్ బ్రోకర్స్ దుకాణాల్లో కుదవ పెట్టి వెంకట్రెడ్డి తన వాటా తీసుకొని మిగిలినవి భాస్కర్, హరివర్ధన్, కుమార్ పంచుకునే వారు.మూడేండ్లుగా ఈ ముఠా నగరంలోని పలు పాన్ బ్రోకర్ దుకాణాల్లో నకిలీ బంగారు ఉంగరాలను కుదవపెట్టి లక్షల్లో అప్పులు తీసుకున్నారు. కాగా కుదవపెట్టిన ఉంగరాలను తీసుకెళ్లకపోవడంతో అనుమానం వచ్చిన పాన్ బ్రోకర్లు ఆరా తీయడంతో నకిలీ బంగారం విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఎస్ఆర్నగర్, జూబ్లీహిల్స్, జగద్గిరిగుట్ట, నల్లకుంట, మియాపూర్,సనత్నగర్, బేగంపేట పోలీస్స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి.