వెంగళరావునగర్, డిసెంబర్ 16 : వెండికి బంగారం పూత పూసి హాల్ మార్కు ముద్రతో బంగారు నగల వ్యాపారులను, పాన్ బ్రోకర్లను బురిడీ కొట్టించి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ముగ్గురు కేటుగాళ్లపై ఎస్ఆర్నగర్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. కర్నూలు సమీపంలోని బి.తాండ్రపాడుకు చెందిన ఈడిగ భాస్కర్(51) బోరబండ మోతీనగర్లో నివసించేవాడు. ఇతడి వద్ద పనిచేసే మహిమలూరు హరివర్ధన్, జవహర్నగర్లోని మసీదు గడ్డకు చెందిన బొబ్బ వెంకటరెడ్డితో కలిసి సులువుగా డబ్బు సంపాదించాలని పథకం వేశారు. 2019లో వెండికి బంగారు పూత పూసి, హాల్ మార్క్ ముద్ర వేసి ఉంగరాలు తయారు చేయడం ప్రారంభించారు.
వాటిని తాకట్టు పెట్టుకునే సమయంలో పాన్బ్రోకర్లు పరీక్షించినా గుర్తించలేకపోయేవారు. రూ.8 వేలు ఖర్చు చేసి తయారు చేసే ఒక్కో ఉంగరాన్ని రూ.18 నుంచి రూ.20 వేలకు తాకట్టు పెట్టేవారు. ఈ విధంగా నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని 200లకు పైగా పాన్ బ్రోకర్లు, నగల వ్యాపారుల వద్ద నకిలీ ఉంగరాలను తాకట్టుపెట్టి కోట్ల రూపాయలు కొట్టేశారు. ఈ మోసం వెలుగు చూడటంతో ఎస్ఆర్నగర్ పోలీసులు అక్టోబర్లో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో నిందితులైన ఈడిగ భాస్కర్, బొబ్బ వెంకటరెడ్డి, హరివర్ధన్లపై నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు తాజాగా పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.