సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): నకిలీ నోట్లను తయారు చేసి వాటిని మార్కెట్లో చలామణి చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేయగా, నిందితుల్లో మాజీ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. గురువారం సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సిద్దిపేటకు చెందిన చిక్కాపురం సంతోష్కుమార్ ఫొటో గ్రాఫర్గా పనిచేస్తున్నాడు. స్నేహితుడైన జానకి సాయికుమార్తో కలిసి నకిలీ నోట్లను ముద్రించి మార్కెట్లో చలామణి చేయాలని ప్లాన్ చేశారు. ధర్మాజి నీరజ్కుమార్, జలిగం రాజు లతోపాటు గతంలో బీఎస్ఎఫ్లో పనిచేస్తూ..విధులకు సరిగ్గా హాజరుకాకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించబడిన సుంకరి శ్రీనివాస్లతో కలిసి చర్చించారు.
10 శాతం కమీషన్తో ఈ ముగ్గురు బయట నోట్లను చలామణి చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఒక అసలు నోటుకు మూడు నకిలీ నోట్లు మార్కెట్లో విక్రయించేలా ఈ ముఠా ప్లాన్ చేసింది. ఇందుకోసం స్కానర్లు, ప్రింటర్లు, ల్యాప్టాప్లు సమకూర్చుకున్నది. మొదటి రెండు ఐదు వందల నోట్లను ప్రింట్ చేసి ఒకటి కూరగాయల మార్కెట్లో, మరొకటి వైన్షాప్లో మారిపించారు. వీటిని ఎవరూ గుర్తుపట్టకపోవడంతో మరిన్ని ప్రింటింగ్ చేయడం మొదలు పెట్టారు.
రూ. 16 లక్షల విలువైన రూ. 500, రూ. 200, రూ. 50 నోట్లను ప్రింట్ చేసి, వాటిని నగరంలో విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజేశ్ బృందం, ఈ ముఠా యూసుఫ్గూడ చెక్పోస్టు వద్ద తిరుగుతుండగా, అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 16 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నోట్ల తయారీకి ఉపయోగిస్తున్న సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అసలుకు, నకిలీ నోట్లకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని సీపీ సూచించారు. ఈ సమావేశంలో టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.