సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాల వ్యవహారంపై విచారణ వేగవంతం చేశారు. 30 సర్కిళ్ల పరిధిలో సరైన పత్రాలు లేకుండా కేవలం తెల్ల కాగితాలు అప్లోడ్ చేసి 27,328 జనన, 4,126 మరణ ధ్రువపత్రాలు జారీ చేయడం.. వాటిని రద్దు చేయడం.. ఇందులో అర్హుల కోసం ప్రత్యేకంగా మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించడం లాంటివి చేశారు.
ఇదంతా ఒక ఎత్తయితే మరో వైపు ఈ అక్రమాల వెనుక ఎవరి పాత్ర ఎలా ఉందనే అంశంపై నిగ్గు తేల్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) బృందం గడిచిన రెండు రోజులుగా విచారణ జరుపుతున్నది. ప్రాథమిక అంచనా మేరకు 15 మీ సేవా సెంటర్ల నిర్వాహకులు, సంబంధిత కంప్యూటర్ ఆపరేటర్లను ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో జీహెచ్ఎంసీ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు సైతం విచారణకు రంగంలోకి దిగారు.
మెహిదీపట్నం సర్కిల్లో 5,877 నకిలీ పత్రాలు మంజూరు చేయడం..ఆ తర్వాతి స్థానంలో చార్మినార్ 3,949, బేగంపేట 2787, సికింద్రాబాద్లో 1,702 సర్టిఫికెట్లు జారీ చేసినట్లు గుర్తించగా..వీటి ఆధారంగా స్థానిక పోలీసులు ఆయా మీ సేవా సెంటర్ నిర్వాహకులతో పాటు సంబంధిత ఏఎంఓహెచ్లకు నోటీసులు ఇస్తూ విచారణ జరుపుతున్నారు. ఏకకాలంలో ఈవీడీఎం, స్థానిక పోలీసులు విచారణకు రంగంలోకి దిగడంతో అక్రమార్కుల్లో దడ మొదలైంది. ఒకటి రెండు రోజుల్లో ఈ విచారణపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.