అల్లాపూర్,జనవరి11: అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రామారావునగర్, స్నేహపూరి కాలనీ, కబీర్ నగర్ మొదలగు లోట్టు ప్రాంతాల్లో వరద ముంపు సమస్య పరిష్కారం కోసం చేపట్టిన నాలా విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. నాలా కుంచించుకుపోయిన ప్రదేశంలో పనులు వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ పనులు పూర్తయితే ఇక్కడ ప్రాంతం వారికి ముంపు సమస్య తప్పనుంది.
వేగంగా విస్తరణ పనులు..
అల్లాపూర్ ప్రాంతం రామారావునగర్ నుంచి, స్నేహపూరి కాలనీ, కబీర్ నగర్, బబ్బుగూడ వరకు ప్రవహించే నాలాను విస్తరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నాలా కుచించుకుపోవడంతో వర్షం కురిసినప్పుడు నాలాను ఆనుకొని ఉన్న బస్తీలు, కాలనీల్లో రోడ్లపైకి వదర నీరు చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పతోంది. ఇక ఇండ్లలోకి వరద నీరు చేరి ఇక్కడ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆయన సానుకూలంగా స్పందించి నాలా విస్తరణకు కావాల్సిన నిధులు మంజూరు చేయించారు. కేటీఆర్ చేతుల మీదుగా రూ.14కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన జరిగి నాలా విస్తరణ పనులు వేగంగా జరుతున్నాయి. రామారావు నగర్ మొదలుకొని వివిధ కాలనీల మీదుగా బబ్బుగూడ వరకు మొత్తం 1.2కిలోమీటర్ల మేర నాలాకు ఇరువైపులా 5 మీటర్ల వెడల్పుతో ఆర్సీసీ రిటర్నింగ్ వాల్ నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 800 మీటర్ల మేర విస్తరణ పనులు జరిగాయని..వేగంగా పనులను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. విస్తరణ పనులను ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే పరిశీలిస్తూ త్వరిగతిన పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశిస్తున్నారు.
త్వరలో పనులు పూర్తి చేస్తాం..
నాలా ప్రహరీ నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేసి వరద సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. ఎక్కడైతే నాలా కుచించుకుపోయిందో మొట్టమొదటిగా అక్కడే విస్తరణ పనులు జరిగేలా చర్యలు తీసుకున్నాం.. దాంతో వర్షం కురిసినప్పడు వరదనీరు రోడ్లపైకి రాకుండా సాఫీగా వెళ్లేందుకు వీలుగా ఉంటుంది. 1.2కిలో మీటర్ల పొడవు, 5మీటర్ల వెడల్పుతో నాలాకు ఇరువైపులా ఆర్సీసీ వాల్ నిర్మాణం జరుగతున్నది. ఇప్పటి వరకు 800 మీటర్ల మేర విస్తరణ పనులు పూర్తయ్యాయి.
– రంజిత్, ఏఈ
ముంపు సమస్యతో ఇబ్బందులు పడ్డాం..
వానకాలం వచ్చిందంటే నాలా పరివాహక ప్రాంతాల్లో నివసించే జనం భయంతో కాలం గడపాల్సిన పరిస్థితి. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని నేరవేర్చాలనే సంకల్పంతో మంత్రి కేటీఆర్ సహకారంతో రూ.14కోట్ల వయ్యంతో పనులు చేపట్టారు. పనులు పూర్తయితే ఇక్కడి ప్రజలకు ముంపు సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
– జోసెఫ్, కబీర్నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు