సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ) / ఘట్కేసర్ రూరల్ : ప్రతి విద్యార్థి లక్ష్య సాధన కోసం కృషి చేసినప్పుడే విజయాలు సొంతమవుతాయని రాచకొండ పోలీసు కమిషనర్ డీ.ఎస్.చౌహాన్ అన్నారు. ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్శిటీ వార్షికోత్సవం సందర్భంగా శనివారం జరిగిన సినర్జీ 2కె23 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కలలు కని వాటిని సాకారం చేసుకునేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉంటూ, సోషల్ మీడియా, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.
విద్యార్థులు మారుతున్న సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా నైపుణ్యతను పెంపొందించుకోవాలని అన్నారు. అంతకు ముందు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఎస్. రామచంద్రం వార్షిక నివేదికను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1500 మంది వివిధ రంగాలలో ఉద్యోగాలు పొందారని గుర్తు చేశారు. యూనివర్శిటీ సీఈవో ఎస్. నీలిమ మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాలలో నైపుణ్యతను పెంపొందించడానికి యాజమాన్యం, అధ్యాపక బృందం కృషి ఎంతో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీన్లు డాక్టర్ జి. విష్ణుమూర్తి, డాక్టర్ నారాయణ రెడ్డి, డాక్టర్ వసుధబక్షీ, డాక్టర్ వి. శ్రీనివాస్రావు, డైరెక్టర్లు డాక్టర్ మహిపతి శ్రీనివాస్ రావు, డాక్టర్ వెంకట రమణ, ప్రిన్సిపాల్ రఫత్ రజియా, కార్యక్రమం కన్వీనర్ కె.శ్రీనివాస్ చలపతి, అధ్యాపకులు విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.