చిక్కడపల్లి/ముషీరాబాద్, జూన్ 16 : ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికే వార్డు కార్యాలయాల ఏర్పాటు చేయడం జరిగిందని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ నూతన వార్డు కార్యాలయాన్ని చిక్కడపల్లి మున్సిపాల్ మార్కెట్లో ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే స్టీఫెన్సన్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, స్థానిక కార్పొరేటర్ పావనితో కలిసి ప్రారంభించారు. ప్రజలకు సేవా చేయడం అంటే ఓ భగవంతునికి సేవ చేయడం వంటిదని అన్నారు. ప్రజలు రకరకాల సమస్యల పరిష్కారం కోసం వార్డు కార్యాలయానికి వస్తుంటారని, వారి సమస్యలను ఓపికగా విని తగిన విధంగా పరిష్కరించాలని అధికారులకు చెప్పారు. వార్డు కార్యాలయాలకు వచ్చే ప్రజలకు గౌరవం, మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. ఎమ్మెల్యే ముఠాగోపాల్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు సత్వర పరిష్కారానికి వార్డు కార్యాలయాలు ఉపయోగపడుతాయని వివరించారు.
ప్రజల వద్దకే పాలన అందించాలని వార్డు కార్యాలయం ఏర్పాటు జరిగిందన్నారు. స్థానిక కార్పొరేటర్ పావని మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. నియోజకవర్గానికే రోల్డ్ మాడల్గా ఈ కార్యాలయం నిలబడాలన్నారు. వార్డు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(ఏఎంసీ)ప్రవీణ్ చంద్ర మాట్లాడుతూ.. ఉదయం వార్డు కార్యాలయం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుందని, అన్ని శాఖలకు సంబంధించిన 10 మంది అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఎలాంటి ప్రజా సమస్యలు ఉన్నా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ అవకాశాని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యాక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, డీఎంసీ తిప్పర్తి యాదయ్య, డీఈ గీత, వాటర్వర్క్స్ డీజీఎం కార్తిక్ రెడ్డి, మేనేజర్ కృష్ణమోహన్, ఇంజినీరింగ్ విభాగం నుంచి ఏఈ అబ్దుల్ సలాం, యూడీసీ విభాగం అధికారి విజయలక్ష్మి, శానిటేషన్ అధికారి ఎ.బాల్రాజ్, టౌన్ ప్లానింగ్ అధికారి దాసరి హర్షిత, ఎంటమాలజీ విభాగం అధికారి డి.అంజయ్య, యూబీడీ విభాగం అధికారి చప్పిడి గౌతమ్, టీఎస్ఎస్పీడీసీఎల్ విభాగం అధికారి రవీంద్రరావు, వెంకటేశ్వరరావు, వాటర్వర్క్స్ నుంచి మల్లేశ్, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, బీజేపీ నాయకులు వినయక్ కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
అడిక్మెట్లో వార్డు కార్యాలయం ప్రారంభం
ముషీరాబాద్ : దేశానికే మోడల్గా ఉండేలా బీఆర్ఎస్ ప్రభుత్వం వార్డు పరిపాలనకు శ్రీకారం చుట్టిందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం వార్డు కార్యాలయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని, ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండి జవాబుదారిగా పని చేయడానికి వార్డు కార్యాలయాలు దోహదపడుతాయన్నారు. శుక్రవారం అడిక్మెట్లో ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాన్ని స్థానిక కార్పొరేటర్ సీ.సునీతా గౌడ్, డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్యతో కలిసి ప్రారంభించారు. అడిక్మెట్ వార్డు కార్యాలయంలో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, మొదటి అంతస్తును వినియోగించుకునేలా మెట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శ్రీనివాస్, ఏఎంహెచ్ఓ మైత్రేయి, వార్డు ఇన్చార్జి సంధ్య, బీఆర్ఎస్ యూత్ విభాగం నేత ముఠా జయసింహ, సీనియర్ నేత బి.మనోహర్సింగ్, రామాలయం చైర్మన్ రవియాదవ్ తదితరులు పాల్గొన్నారు.