మేడ్చల్ రూరల్, సెప్టెంబర్ 15 : దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్రే కీలకమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా బుధవారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇంజినీర్స్డేను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ..ప్రపంచం గుర్తించే స్థాయికి దేశం చేరుకోవడంలో ఇంజినీర్ల పాత్ర ఎంతో ఉన్నదన్నారు. విద్యాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని తెలిపారు. అనంతరం మంత్రి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు.
ఇంజినీరింగ్ డే సందర్భంగా సీఎంఆర్లో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ ఆధ్వర్యంలో అశ్విన్ క్యాన్సర్ ఫౌండేషన్తో కలిసి రెడ్క్రాస్ సొసైటీ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. శిబిరంలో 116 మంది రక్తదానం చేశారు. సీఎంఆర్ కార్యదర్శి గోపాల్ రెడ్డి, మల్లారెడ్డి ఆస్పత్రి ఎండీ డాక్టర్ ప్రీతిరెడ్డి, సీఎంఆర్ సీఈవో అభినవ్ రెడ్డి, ప్రిన్సిపాల్ వీఏ నారాయణ, వైద్యులు ఆశిష్ చౌహాన్, విద్యాసాగర్ పాల్గొన్నారు.
గౌడవెల్లి గ్రామ పరిధిలోని హితం ఇంజినీరింగ్ నిర్వహించిన కార్యక్రమంలో ఆర్కా మెడికల్ గ్రీన్ ఎనర్జీ సీఈవో సూర్యప్రకాశ్, జాతీయ ఇంధన సంస్థ రిటైర్డ్ డిప్యూటీ సీఈ ఫణిబాబు, చైర్మన్ ప్రశాంత్, ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించి, సమాజాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్రను వివరించారు.
ఇండియన్ వాటర్ వర్స్ అసోసియేషన్ ( ఐవా) ఆధ్వర్యంలో అమీర్పేటలోని కార్యాలయంలో ఇంజినీర్స్ డేను ఘనంగా నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో ఐవా అధ్య క్షుడు, జలమండలి ఈడీ డా.ఎం. సత్యనారాయణ, కోశాధికారి టి.నవీన్ రెడ్డి, జలమండలి ఇంజినీర్స్ అసోసియేషన్ (జేఈఏ) అధ్యక్షుడు ఎస్ . రాజశేఖర్, జలమండలి డైరెక్టర్లు, శ్రీధర్ బాబు, కృష్ణ , ప్రవీణ్ కుమార్ , రవికుమార్ , స్వామి, జలమండలి ఇంజినీర్లు పాల్గొన్నారు.
సిటీబ్యూరో,సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ ):టీఎన్జీవో జలమండలి శాఖ ఆధ్వర్యంలో ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఇంజినీర్స్ డేను నిర్వహించారు. ఈసందర్భంగా ఇటీవల సిద్దిపేట , కరీంనగర్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన మల్లారం పంప్ హౌజ్ పునరుద్ధరణకు రాత్రింబవళ్లు కష్టపడిన అధికారులు టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ట్రాన్స్మిషన్ సీజీఎం దశరథరెడ్డి, జనరల్ మేనేజర్ బ్రిజేశ్ను టీఎన్జీవో నాయకులు సన్మానించారు. టీఎన్జీవో జలమండలి శాఖ అధ్యక్షుడు మహేశ్ కుమార్, టీఎన్జీవో నాయకులు రజినీకాంత్, సంతోష్ , అజయ్సింగ్, సాయికృష్ణ, ఇతర నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
మాదాపూర్, సెప్టెంబర్ 15: న్యాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్) లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని 150మంది జీహెచ్ఎంసీ సైట్ ఇంజినీర్లు ఇంజినీర్స్ డే నిర్వహించారు. న్యాక్ డైరెక్టర్ జనరల్ కె.భిక్షపతి, డైరెక్టర్ జి.చెన్నారెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ వెంకట్ నారాయణ, ఇంజినీర్లు హాజరయ్యారు.
ఖైరతాబాద్, సెప్టెంబర్ 15 : కాళేశ్వరం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ప్రాజెక్టు అని ఇరిగేషన్ విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజినీర్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, దీంతో అనుకున్న లక్ష్యానికి ముందే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయగలిగామన్నారు. భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజినీర్స్ ఇండియా హైదరాబాద్ సెంటర్ (ఏసీసీఈ)ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో 54వ ఇంజినీర్స్ డే నిర్వహించారు. ఈ వేడుకలను వెంకటేశ్వర్లు, ఏసీసీఈ వైస్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ కాచర్ల, చైర్మన్ ఎ. కాశీరామ్, కార్యదర్శి జె. భీమ్ రావు, కోశాధికారి సి. రమేశ్లతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లుతో పాటు వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో నిష్ణాతులైన ప్రొఫెసర్ బీఎల్పీ స్వామి, ప్రొఫెసర్ ఎస్జీఎస్ మూర్తి, అర్వింద్కుమార్ జైస్వాల్, జి. రామ్రెడ్డిలను సత్కరించారు.