మేడ్చల్, నవంబర్6 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన వ్యయ నియంత్రణ బృందంకు నేతృత్వం వహిస్తున్న డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఎస్హెచ్. అజయ్ బదూ, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్, ఉన్నతాధికారులతో సోమవారం హైదరాబాద్లోని ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్లో కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ సూచనలు పాటించి పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు రూ. 43,62,23,331 కోట్ల నగదు, బంగారు ఆభరణాలను సీజ్ చేసినట్లు కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు. ఇందులో రూ. 18,95,31,161 నగదు కాగా రూ. 24, 66,92,170 కోట్ల విలువ గల బంగారు ఆభరణాలను సీజ్ చేసినట్లు వివరించారు. పట్టుబడిన నగదులో సరైన ఆధారలు చూయించిన వారికి రూ. 8,69,30,114 కోట్ల నగదును తిరిగి అప్పగించనట్లు తెలిపారు. 1,24,098 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుని 645 కేసులను నమోదు చేసి 321 మందిని అరెస్టు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, డీఆర్వో హరిప్రియ, ఎన్నికల అధికారులు శ్రీనివాసమూర్తి, నర్సింహ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సిటీబ్యూరో, నవంబరు 6 (నమస్తే తెలంగాణ ) : రాజకీయ ప్రకటనకు ఎంసీఎంసీ (మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్) కమిటీ అనుమతులు తప్పనిసరి అని ఎన్నికల అధికారి రోనాల్డ్రోస్ తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు, ఆడియో, వీడియో, డిస్ప్లే, వాహనాలు ఎఫ్ఎం రేడియాలో ప్రకటనలు, బల్క్ ఎస్ఎంఎస్లు, వీడియో మెసేజ్లు, సినీమా థియేటర్లలో ప్రకటనలు, కరపత్రాల ప్రింటింగ్ అనుమతులను ఎంసీఎంసీ కమిటీ ద్వారా తీసుకోవాలని అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సీపీఆర్వో , ఎంసీఎంసీ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రింటింగ్ ప్రెస్లో ప్రింటింగ్ చేసిన కరపత్రాలపై పబ్లిషర్ పేరు, అడ్రస్, హ్యాండ్ బిల్ ఇతర పత్రాలు ముద్రించిన సందర్భంలో తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని చెప్పారు. జిల్లాలో ప్రింటర్స్ ఇతర జిల్లాలకు సంబంధించిన ప్రింటింగ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో సంబంధిత జిల్లా ఎంసీఎంసీ కమిటీ అనుమతి తీసుకోవాలని ఎన్నికల అధికారి సూచించారు.