ఖైరతాబాద్ : పర్యావరణహితం…ఆరోగ్యానికి మొక్కల పెంపకం ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో పీవీ నరసింహారావు మార్గ్ లోని పీపుల్స్ప్లాజాలో గురువారం ఏర్పాటు చేసిన 11వ గ్రాండ్ నర్సరీ మేళాను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా పలు స్టాళ్లను పరిశీలించి పుష్పాలు, పండ్లు, ఇండోర్, ఔట్డోర్, అరుదైన మొక్కల జాతులను పరిశీలించి, వాటి ప్రాధాన్యతలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జంట నగరాలు కాంక్రీట్ జంగీల్గా మారిన తరుణంలో ఇలాంటి మేళాలు మానువుడిని ప్రకృతివైపు నడిపిస్తాయన్నారు .
ఉదయాన్నే లేచి కిచెన్, రూఫ్ గార్డెనింగ్లు చేయడం వల్ల శరీరానికి నూతనోత్సాహాన్ని, ఆనందాన్ని అందిస్తుందన్నారు. కొంత మంది కిచెన్ గార్డెను వారి ఇంటి పరిసరాల్లోనే ఏర్పాటు చేసుకొని కుటుంబానికి కావాల్సిన కూరగాయలను, ఆకూకూరలను సేంద్రీ య పద్దతుల్లో పండించుకుంటున్నారని అన్నారు. అలాంటి వారికి ఈ మెగా నర్సరీ మేళా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
దేశ వ్యాప్తంగా ఉండే వందలాది నర్సరీలకు సంబంధించిన వారు ఈ మేళాలో పాలుపంచుకోవడం శుభపరిణామమని, ఈ మెగా నర్సరీ మేళాలో నగర ప్రజలు తమ కావాల్సిన మొక్కలన్నింటిని ఇక్కడే తీసుకోవచ్చన్నారు. నిర్వహకుడు ఖలీద్ అహ్మద్ మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాలుగా నిరాటంకంగా గ్రాండ్ నర్సరీ మేళా నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది 121 స్టాల్స్ పెట్టామని, హర్యానా, హిమాచల్ప్రదేశ్, కశ్మీర్ నుంచి స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు.
పూలతో పాటు ఇండోర్, ఔట్డోర్, కాక్టస్, సక్యూలెంట్స్, అడేనియం, రేర్ ప్లాంట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, ఇతర వ్యవసాయ, తోటల ఉత్పత్తులు, పరికరాలు లభిస్తాయన్నారు.ఈ నెల 28 వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుందన్నారు.