కవాడిగూడ, ఆగస్టు 5 : ప్రపంచ ఎముకల, కీళ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ విజయబాస్కర్, రవి హీలీయోన్ దవాఖాన సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్క్ చౌరస్తాలోని రవి హిలీయోన్ దవాఖానలో వృద్దులు, దివ్యాంగులకు ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ గోడ్చల రచనశ్రీ, గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని, ఇండియన్ ఆర్ధోపెడిక్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ విజయ భాస్కర్లు హాజరై జ్యోతి వెలిగించి శిభిరాన్ని ప్రారంభించారు. వృద్దులు, దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ఎముకల బలం కోసం సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఉదయం విటమిన్ డి కోసం సూర్యోదయం సమయంలో ఎండకు కొద్దిసేపు ఉండాలని సూచించారు. ప్రతి సంవత్సరం ఉచిత వైద్య శిభిరం నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీదేవి, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.