సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): చలాన్ల జారీ మరింత వేగంగా జరుగనున్నది. ఇటీవల నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రారంభించిన రిప్రోగ్రఫీ సెంటర్ నుంచి వీటిని ముద్రించి.. ఉల్లంఘనదారులకు పోలీసులే పంపించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజు 25 వేలు, మూడు కమిషనరేట్ల పరిధిలో సుమారు 15వేల చలాన్లు పోస్టులో వెళ్లనున్నాయి. సర్వర్ సిటీలోనే ఉండటంతో ఇక్కడి నుంచే ఉల్లంఘన లేఖలను వాహనదారులకు పంపిస్తారు. గతంలో పోస్టాఫీసులో అయితే ఈ ప్రక్రియకు వారం రోజుల సమయం పట్టేది. ప్రస్తుతం ఫ్రాంకింగ్ కూడా చేస్తుండటంతో రెండు రోజుల్లోనే చలాన్లు పోస్టాఫీస్కు చేరుకోనున్నాయి.
గతంలో ఈ-చలాన్ వ్యవస్థలో ప్రింటింగ్, ఇన్ల్యాండ్ లెటర్, ఫ్రాంకింగ్ వేర్వేరుగా జరిగేవి. పోలీసులే స్వయంగా చలాన్లు పంపిణీ నిర్వహిస్తుండటం వల్ల సమయం ఆదా కానున్నది. ప్రింటింగ్, ఇన్ల్యాండ్ లెటర్లను స్వయంగా తయారు చేస్తున్నారు. ఫ్రాంకింగ్ను కూడా పోలీసు సిబ్బందే నిర్వహిస్తున్నారు. ఇందుకు ముందుగానే పోస్టాఫీస్లో కొంత డబ్బు పోస్టల్ చార్జీ కోసం డిపాజిట్ చేస్తారు..ఆ మేరకు ఫ్రాంకింగ్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలు కంప్యూటర్లో అదే రోజు సాయంత్రం వరకు అప్లోడ్ చేస్తారు. మరుసటి రోజు చలాన్లు తయారు చేసి, ఫ్రాంకింగ్ చేశాక.. ఆ తరువాత రోజు పోస్టాఫీస్కు పంపిస్తారు. అక్కడి నుంచి సంబంధిత చిరునామలకు వెళ్తాయి.