సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ): రోడ్డు భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా హైదరాబాద్ నగరంలో మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న వారిపై సిటీ ట్రాఫిక్ పోలీసులు కఠినచర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జూలై 17,18 తేదీలలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ను నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 586 మంది వాహనదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు.
పట్టుబడినవారిలో 439 మంది ద్విచక్రవాహనదారులు, 45 మంది ఆటోరిక్షాలు, 97 మంది కార్లు, ఇతర భారీ వాహనాలు నడుపుతున్నవారు ఐదుగురు ఉన్నారని తెలిపారు. అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారని సైబరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ జీ. నరేందర్ తెలిపారు. ఈ డ్రైవ్లో భాగంగా 237 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. 205 మంది ద్విచక్ర వాహనదారులు, 04 ఆటోలు, 28 కార్ల యజమానులపై కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు.