సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్-న్యూ) తాజాగా నిర్వహించిన గోవా ఆపరేషన్లో ప్రధాన డ్రగ్ స్మగ్లర్ పట్టుబడ్డాడు. శుక్రవారం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్న్యూ డీసీపీ చక్రవర్తి గుమ్మి, ఈస్ట్జోన్ డీసీపీ సునీల్ దత్ వివరాలను వెల్లడించారు. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులతో కలిసి హెచ్న్యూ నిర్వహించిన ఆపరేషన్లో గోవాకు చెందిన కీలక డ్రగ్ విక్రేత ప్రీతీష్ నారాయణ బోర్కర్ పట్టుబడ్డాడు. అతడికి తెలుగు రాష్ర్టాల్లో 600 మంది కస్టమర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి నెట్వర్క్పై దృష్టి పెట్టారు. తాజాగా.. హెచ్న్యూ, ఇన్స్పెక్టర్లు రాజేశ్, రమేశ్, ఎస్సై డానియల్తో కూడిన బృందం గోవాకు వెళ్లింది. అక్కడ బోర్కర్కు డ్రగ్ సరఫరా చేస్తున్న వారిని పట్టుకోవడం కోసం స్థానిక పోలీసులతో కలిసి ఆపరేషన్ నిర్వహించారు. అంజానా బీచ్ ప్రాంతంలో 1983 నుంచి హిల్టాప్ పేరుతో ఓపెన్ ఎయిర్ బార్, పబ్తో పాటు గోవా బజార్ ప్రైడే మార్కెట్ నిర్వహిస్తున్న జాన్ స్టీఫెన్ డిసౌజా అలియాస్ స్టీవ్ కొంతకాలంగా మంజూర్ అహ్మద్ ద్వారా ప్రీతీష్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు రోజుల కిందట గోవాలో డిసౌజాను హెచ్న్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని తొలుత స్థానిక కోర్టులో హాజరు పరిచిన అనంతరం హైదరాబాద్కు తరలించారు. ప్రతీష్ నారాయణకు 600 మంది కస్టమర్లు ఉండగా.. అందులో 166 మందిని గుర్తించి, 60 మందికి నోటీసులు జారీ చేసినట్లు హెచ్న్యూ డీసీపీ వెల్లడించారు.
ఘనా జాతీయుడు అరెస్ట్
బెంగళూర్ కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్న ఘనా జాతీయుడిని హెచ్-న్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఘనా దేశానికి చెందిన ఆంటోని బోటాంగ్ అమిహెరే అలియాస్ సమావే, నెల్లూర్కు చెందిన ఏజెంట్ ద్వారా హైదరాబాద్లోని టోలిచౌక్ ప్రాంతంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతడు బెంగళూర్లో అక్రమంగా నివసిస్తున్నాడు. తరచూ బెంగళూర్ నుంచి నగరానికి వచ్చి ఎండీఎంఏ డ్రగ్ను సరఫరా చేస్తున్నాడు. నెల్లూర్కు చెందిన సుమంత్ అతడికి ఏజెంట్గా మారాడు. సుమంత్, టోలిచౌక్లోని వీర శివారెడ్డికి డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. దీనిని గుర్తించిన హెచ్-న్యూ టీమ్ వీర శివారెడ్డిని అరెస్ట్ చేసింది. అతడిని విచారించడంతో సుమంత్, సమావే పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 17 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి విచారణ కోసం లంగర్హౌస్ పోలీసులకు అప్పగించారు.
సమన్వయంతో పనిచేద్దాం..
హైదరాబాద్ పోలీసులు గోవాలో డ్రగ్స్ స్మగర్లను వరుసగా అరెస్ట్ చేస్తుండటంతో అక్కడి ప్రభుత్వం స్పందించింది. డ్రగ్ స్మగర్లను పట్టుకోవడంలో హైదరాబాద్ పోలీసులకు మా వంతు సహకారం అందిస్తామని ప్రకటించా రు. మాదకద్రవ్యాల నిరోధానికి ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర సమన్వయ కమిటీ (ఐఎస్ సీసీ) సమావేశం గురువారం గోవా రాజధాని పనాజీలో జరిగింది. ఈ సమావేశానికి హైదరాబాద్ పోలీసుల తరఫున డీసీపీ డి.సునీతారెడ్డి హాజరయ్యారు.
seller