సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ): కేశాల అక్రమ రవాణా కాసులు కురిపిస్తున్నది. చైనీయుల సహకారంతో కొందరు వ్యాపారులు ఏడాదికి రూ. 8వేల కోట్ల దందా చేస్తున్నట్లు ఈడీ గుర్తించింది. ఒక హైదరాబాద్ నుంచే రూ. 217 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు తేలింది. ఈ స్మగ్లింగ్ చేసే వాళ్లు తెలుగు రాష్ర్టాలతో పాటు మిజోరంలో ఉన్నారంటూ..కొందరు అనుమానితుల పేర్లను సీసీఎస్ పోలీసులకు అందజేసింది.
ఒక హైదరాబాద్ నుంచే…
భారత్ నుంచి మయన్మార్, బంగ్లాదేశ్, వియత్నాం, చైనా దేశాలకు హైదరాబాద్ ఎయిర్పోర్టు మీదుగా వెంట్రుకల స్మగ్లింగ్ జరుగుతున్నదంటూ.. ఈడీ దృష్టికి రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. సంవత్సరానికి సుమారు రూ. 8 వేల కోట్ల కేశాల అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు. కేవలం హైదరాబాద్ నుంచి మయన్మార్కు రూ. 217 కోట్ల ఎగుమతులు అయినట్లు తేలింది. చాలా కంపెనీలు తమ ఎగుమతి విలువలను తక్కువగా రికార్డుల్లో చూపించినట్లు ఆధారాలు సేకరించారు. లింక్యుమ్, డోకిపే కంపెనీల ద్వారా ఆయా కంపెనీలకు డబ్బులు బదిలీ అయినట్లు, హవాల ద్వారా లావాదేవీలు సాగినట్లు వెల్లడైంది. హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు వెస్ట్గోదావరి జిల్లాలోని తణుకులో ఉన్న ఎనిమిది కంపెనీలకు డబ్బు బదిలీ అయినట్లు ఆధారాలు లభించాయి.
ఆ సంస్థలపై..
నాయ్ లా ఫ్యామిలీ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థ డైరెక్టర్లు వాల్ పోయో, మహ్మద్ ఇబ్రహీం పటేల్, దాదువాల్ శ్రీకాంత్లతో పాటు సంగమ్ ఉదయ్కుమార్, బుసగల్ల శ్రీశైలం, తోట రాజేశ్, భూపతి శ్రీకాంత్, మిజోరంలోని సెయింట్ మేరిస్ జెమ్ ఇండస్ట్రీ, సంస్థ భాగస్వామి లుకాస్ తంగ మంగళ, మీజోరంలోని సన్మూన్ హ్యూమెన్ హెయిర్ తదితర సంస్థలపై ఈడీ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఎక్కడి నుంచి..
తెలంగాణ, ఏపీలోని కేశాలు ఎగుమతి చేసే వ్యాపారుల వద్ద ఉన్న పత్రాలు, ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు? ఎక్కడి నుంచి ముడి సరుకు కొనుగోలు చేశారు? వారి బ్యాంకు ఖాతాలు తదితర అంశాలను ఏసీపీ సూర్యప్రకాశ్ నేతృత్వంలోని బృందం పరిశీలిస్తున్నది. హైదరాబాద్ నుంచి మిజోరానికి విమానంలో తరలించి.. అక్కడి నుంచి విదేశాలకు ఎలా స్మగ్లింగ్ చేస్తున్నారనే విషయాలను పరిగణలోకి తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ కూడా చేసేందుకు సీసీఎస్ సన్నాహాలు చేస్తున్నది.