సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): నిలోఫర్ దవాఖానలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వంద మందికి పైగా చిన్నారులకు కొవిడ్ నిర్ధారణ కోసం నమూనాలు సేకరించినట్లు దవాఖాన వర్గాలు తెలిపాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలున్న 100మందికి పైగా ఉన్న వారిని కరోనా అనుమానితులుగా పరిగణించి.. టెస్టులు చేశారు. వారి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు వైద్యాధికారులు తెలిపారు.
ప్రత్యేక ఏర్పాట్లు..
అనుమానిత లక్షణాలున్న చిన్నారుల కోసం గతంలోనే ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు వెలువడే వరకు చిన్నారులను ఈ ప్రత్యేక వార్డుల్లో ఉంచుతామని, పాజిటివ్ అని తేలితే..దవాఖానలో ఏర్పాటు చేసిన సెష్పల్ ఐసొలేషన్ వార్డుకు, నెగిటివ్ వస్తే సాధారణ వార్డులకు తరలిస్తామని వైద్యశాల వర్గాలు వివరించాయి. ప్రస్తుతం నిలోఫర్లో రెండు పాజిటివ్ కేసులు ఉన్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు.
మరో వారం వరకు చెప్పలేం
పిల్లలపై కరోనా ప్రభావం ఎలా ఉంటుందో మరో వారం రోజుల వరకు చెప్పలేం. ప్రస్తుతానికి అయితే వైరస్ తీవ్రత వారిపై పెద్దగా లేదు. గడిచిన రెండు వేవ్లలో కూడా చిన్నారులపై కొవిడ్ ప్రభావం చూపలేదు. ఇప్పుడు మూడో వేవ్ మొదలైందనే వార్తలు వస్తున్నాయి. కేసులు పెరుగుతున్నాయి. కానీ.. పిల్లలపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఎఫెక్ట్ చూపలేదు. ఒకటి రెండు కేసులు వచ్చినా.. వాటిలో పెద్దగా తీవ్రత లేదు. నిలోఫర్లో 700 ఆక్సిజన్ పడకలు పిల్లల కోసం ఏర్పాటు చేశాం. 150 వరకు వెంటిలెటర్లు ఉన్నాయి. 200పైగా ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయి.