సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పూర్తి అవగాహనతో ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూమ్లో సీపీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి రోనాల్డ్ రాస్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, అవలంభించాల్సిన విధానాలను కమిషనర్ వివరించారు. ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని, అభ్యర్థి వెంట మరో నలుగురిని మాత్రమే లోనికి అనుమతిస్తారని తెలిపారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వేరే పార్లమెంట్ సెగ్మెంట్కు చెందిన వారైన పక్షంలో తప్పనిసరిగా వారి అసెంబ్లీ సెగ్మెంట్ ఈఆర్వో నుంచి ఓటరు ధ్రువీకరణ పత్రం సమర్పించాలని కమిషనర్ రోనాల్డ్ రాస్ సూచించారు. ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంకు అకౌంట్ తెరవాలని, దీని ద్వారానే ఎన్నికల వ్యయానికి సంబంధించిన లావాదేవీలు నిర్వహిస్తూ పకాగా రికార్డులు నిర్వహించాలని సూచించారు. అభ్యర్థులు గరిష్ఠంగా రూ. 95 లక్షల వరకు ఎన్నికల్లో ఖర్చు చేయవచ్చని, సంబంధిత బ్యాంకు అకౌంట్ లావాదేవీల ఆధారంగానే అభ్యర్థుల వ్యయాన్ని లెక్కిస్తామన్నారు.
అభ్యర్థులు తమపై ఏవైనా క్రిమినల్ కేసులు ఉంటే నామినేషన్ పత్రంలోని పార్ట్-III ఏ లో వాటి వివరాలను తప్పనిసరిగా పొందుపర్చాలన్నారు. నామినేషన్ సమర్పించే ముందు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలన్నారు. నామినేషన్ పర్వం మొదలైనందున ఇప్పటికే 144 సెక్షన్ విధించినట్లు సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నామినేషన్ సందర్భంగా ఎన్నికల నియమావళి పరిధిలోనే ఉండాలని, రాత్రి 10 గంటల తర్వాత ప్రచారం చేయకూడదని చెప్పారు. ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ అదనపు కలెక్టర్ సికింద్రాబాద్ ఆర్వో హేమంత్ కేశవ్ పాటిల్, కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
వచ్చే నెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి విధులు నిర్వర్తించేందుకు సిబ్బంది కొరత ఏర్పడటంతో దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వారిని వెంటనే ఎన్నికల విధులకు రిపోర్టు
చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఆదేశాలు జారీ చేశారు. దీర్ఘకాలిక సెలవులతో పాటు విదేశీ ప్రయాణాలకు శాఖల అనుమతులు తీసుకున్న వారు కూడా ఎన్నికల విధుల్లోకి రావాలని ఆదేశించారు.