కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 13: నగరంలో వీధి కుక్కలు మరో చిన్నారిని పొట్టనపెట్టుకున్నాయి. అభంశుభం తెలియని పసికందును చిదిమేశాయి. ఈ హృదయవిదారకర ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గడ్ రాష్ర్టానికి చెందిన విశ్వం ప్రసాద్ మంజుదేవి దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. కుమారుడు ఛత్తీస్గడ్లోనే హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఇద్దరు కుమార్తెలతో కలిసి నగరానికి వలస వచ్చిన దంపతులు.. కుత్బుల్లాపూర్లోని సుచిత్ర సమీపంలోని గాయత్రీనగర్ గోదావరి హోమ్స్లో ఓ బహుళ అంతస్తుల నిర్మాణ పనుల్లో కూలీ పనులు చేసుకుంటూ.. అక్కడే తాత్కాలికంగా కార్మికుల కోసం ఏర్పాటు చేసిన గుడిసెల్లో నివాసముంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం దంపతులు పనుల్లో నిమగ్నమవ్వగా, వారి చిన్న కూతురు దీపాలి (రెండున్నరేండ్లు) అక్కతో కలిసి ఆరుబయట ఆడుకుంటున్నది.
ఈ క్రమంలో వీధి కుక్కలు అక్కడికి వచ్చాయి. దీపాలి అక్క భయంతో పరుగులు తీసింది. అయితే దీపాలి మాత్రం అక్కడే భయంతో ఏడ్చుకుంటూ ఉండటంతో ఒక్కసారిగా వీధి కుక్కలు విచక్షణరహితంగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారిని తల్లిదండ్రులు హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం చిన్నారి మృతి చెందింది. కండ్ల ముందటే అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు..విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.