డిప్యూటీ కమిషనర్ కృష్ణ ప్రసాద్
మారేడ్పల్లి, మే 24: ఆదాయం లేని పురాతన ఆలయాలను కాపాడుకునేందుకే ప్రభుత్వం ధూప, దీప, నైవేద్యం పథకాన్ని ప్రవేశపెట్టిందని, బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకోవాలని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కృష్ణ ప్రసాద్ సూచించారు. మారేడ్పల్లిలోని మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్లో మంగళవారం ధూప, దీప నైవేద్యం పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ బ్రాహ్మణ సేవా వాహిని అధ్యక్షులు రఘు కిరణా చార్యులు, డిప్యూటీ కమిషనర్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆదాయం లేని పురాతన దేవాలయాలను సంరక్షించేందుకు ప్రభుత్వం ధూప, దీప నైవేద్యం పథకాన్ని అమలు చేస్తున్నదని తెలిపారు.
వచ్చేనెల 5వ తేదీ లోపు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ టి. రాజేశ్వర శర్మ, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర శర్మ, ఉపాధ్యాక్షులు పతంజలి శర్మ, కార్యదర్శి ఏదుల శ్రీనివాస్ శర్మ, తెలంగాణలోని వివిధ దేవాలయాల్లో పని చేస్తున్న 300 మంది అర్చకులు పాల్గొన్నారు.